
- రైజింగ్ తెలంగాణ 2047’పై సీఎస్ కీలక ప్రజెంటేషన్
- 14న ఎంసీహెచ్ఆర్డీలో అన్ని శాఖల సెక్రటరీలకు వివరించనున్న రామకృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘రైజింగ్ తెలంగాణ 2047’’విజన్ డాక్యుమెంట్పై కీలక సమావేశం జరగనున్నది. ఈ నెల 14న ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్రంలోని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ రామకృష్ణా రావు కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2047 నాటికి తెలంగాణ.. ఏ రంగంలో ఎలా ఉండాలి, ఎలాంటి లక్ష్యాలను సాధించాలి, అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఏంటి? అనే అంశాలపై ఈ ప్రజెంటేషన్ విస్తృత అవగాహన కల్పించనున్నది.
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ‘‘రైజింగ్ తెలంగాణ 2047”విజన్ డాక్యుమెంట్ అనేది కేవలం ఒక ప్రణాళిక కాదని, రాబోయే 2 దశాబ్దాలకు పైగా రాష్ట్ర పురోగతికి మార్గదర్శకం అని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.