మిర్చి వద్దు.. పత్తి ముద్దు!.. కొన్నాళ్లుగా తగ్గిపోయిన పంట దిగుబడి..ధర

మిర్చి వద్దు.. పత్తి ముద్దు!.. కొన్నాళ్లుగా తగ్గిపోయిన పంట దిగుబడి..ధర
  • మూడేండ్లలో రూ.25 వేల నుంచి రూ.9700కు పడిపోయిన రేటు
  • పంటకు తెగుళ్లు, వైరస్ లతో పురుగు మందులకు లక్షల్లో ఖర్చులు
  • కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి అమ్మినా మార్కెట్ లో ధర పలకడంలేదు
  • గతంలో 1.35 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే.. ఈసారి 75 వేలకు అంచనా..
  • మిర్చి సాగును వదిలేసి పత్తి పంట వైపు ఖమ్మం జిల్లా రైతుల మొగ్గు 

ఖమ్మం, వెలుగు: ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో  రైతులు మిర్చి సాగుకు ఆసక్తి చూపించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది 60 వేల ఎకరాల్లోపే సాగు ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఐదేండ్ల కింద  జిల్లాలో1.35 లక్షల ఎకరాలు తేజా రకం మిర్చి సాగు చేయగా.. ఆ తర్వాత1.20 లక్షల ఎకరాలకు తగ్గింది. మూడేండ్ల కింద 90 వేల ఎకరాల్లో పంట వేస్తే.. ఆ ఏడాది క్వింటా రేటు రూ.పాతిక వేలు దాటింది. దీంతో తర్వాత ఏడాది 93 వేల ఎకరాలకు సాగు పెరిగింది.

 అయితే.. పంటకు విపరీతమైన తెగుళ్లు, వైరస్​లు  సోకడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా దిగుబడి పూర్తిగా పడిపోయింది. పంటను కాపాడుకునేందు కు ఎక్కువ పురుగు మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా నష్టపోయారు. గతేడాది మళ్లీ 90 వేల ఎకరాలకు పంట సాగు తగ్గిపోయింది. అయినా దిగుబడులు సరిగా లేకపోగా ఎక్స్ పోర్ట్ ఆర్డర్లు లేవంటూ వ్యాపారులు రేటును పూర్తిగా తగ్గించేశారు. 

ఇక దేశీయ ఆర్డర్లపైనే మిర్చి బిజినెస్ నడుస్తుండడంతో రూ.25 వేలు పలికిన ధర ఇప్పుడు రూ.10 వేలు మాత్రమే పలుకుతోంది. గతేడాది కోల్డ్ స్టోరేజీల్లో మిర్చిని నిల్వచేసుకొని మంచి రేటు వస్తుందని ఆశించిన రైతులకు చివరకు నిరాశే ఎదురైంది. కోల్డ్ స్టోరేజీ అద్దెలు దండగకావడంతో పాటు రేటు మరింత పడిపోవడంతో నష్టానికే అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులన్నీ చూసిన మిర్చి రైతులు ఈసారి ప్రత్యామ్నాయంగా పత్తి సాగుకు మొగ్గు చూపారు. 

60 వేల ఎకరాల్లోపే సాగు అంచనా..

తాజాగా ఎక్కువమంది రైతులు మిర్చిని కాకుండా పత్తి సాగు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అంచనాల మేరకు 60 వేల ఎకరాల వరకు పంట సాగు తగ్గిపోయే అవకాశముందని సమాచారం. గతేడాది సీజన్​ప్రారంభంలో గరిష్టంగా క్వింటా ధర రూ.19 వేల వరకు పలుకుతూ.. అది కాస్త తగ్గుతూ పోయింది.   వారం కింద ఏసీ మిర్చి ధర క్వింటా రూ.13 వేలు పడిపోయింది. నాన్​ఏసీ మిర్చీ ధర కనిష్టంగా రూ.9,300   పలికింది. అధికారులు చెప్పే ఈ జెండా పాట రేటు కూడా మార్కెట్ కు వచ్చిన పంటలో కొద్దిమందికే దక్కుతుండగా, క్వాలిటీ లేదంటూ అంతకంటే తక్కువ ధరకే మిగిలిన పంటను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. 

ముందుగా చెప్పిన రేటును కూడా తగ్గించి, కాంటాలు అయ్యే సమయంలో క్వింటాకు రూ.300 వరకు రేటు కోత పెడుతున్నారు. దీంతో రూ.8వేలకు, చివరకు రూ.6 వేలకు కూడా మిర్చిని రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మిర్చి ఏరేందుకు కూలీ ఖర్చులు, మార్కెట్ రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో ఈసారి రైతులు సాగు చేయొద్దని నిర్ణయించుకున్నారు. 

పెరిగిన పెట్టుబడి ఖర్చులు

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనే తేజా రకం మిర్చిని సాగు చేస్తారు. ఘాటు ఎక్కువగా ఉండడంతో ఈ రకానికి విదేశాల్లో మస్తు డిమాండ్ ఉండేది. గతంలో ఇక్కడి నుంచి చెన్నై పోర్టు మీదుగా థాయ్​లాండ్​, బంగ్లాదేశ్, మలేషియా, చైనా, సింగపూర్​ దేశాలకు ఎగుమతి అయ్యేది. ప్రతి ఏటా రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఎగుమతులు జరిగేవి. రెండేండ్లుగా ఆ పరిస్థితి లేదు. సీజన్​మొదట్లో ఎక్కువగా కురిసిన వర్షాల కారణంగా తోటలు దెబ్బతినేవి. ఒకటికి రెండు సార్లు మొక్కలు నాటుకోవాల్సి వచ్చేది. 

పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఎరువులు, పురుగు మందులకు ఒక్కో రైతు రూ.లక్షల్లో ఖర్చు చేసే పరిస్థితి ఉంది.  ఇంత చేసినా దిగుబడి అంతంత మాత్రమే. ఎకరానికి యావరేజీగా 25  క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గతేడాది 15 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి.  ఇన్ని కష్టనష్టాలను భరించలేని రైతులు పత్తి వంటి ఇతర పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. 

 తగ్గుతున్న మిర్చి సాగు  

ఈ ఏడాది రైతులు మిర్చి సాగు తగ్గించారు. గతేడాది గిట్టుబాటు ధర లేకపోవడంతో కూలీలకు, పురుగు మందులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదని రైతులు చెబుతున్నారు. మిర్చి సాగును చాలా తగ్గించి, పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. కూసుమంచి మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో మిర్చి సాగు తగ్గే అవకాశాలు ఉన్నాయి.   రామడుగు వాణి, ఏవో, కూసుమంచి

 నష్టం వచ్చిందని పత్తి వేశా..

 రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని రెండేండ్లు మిర్చి సాగు చేశాను. ఏటా రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకు పెట్టుబడి ఖర్చులు పెట్టా. గతేడాది పంటకు రేటు లేకపోవడంతో రూ.7 లక్షల వరకు నష్టపోయా. చివరకు కూలీలకు డబ్బులు లేక వడ్డీలకు తీసుకువచ్చి కట్టా. మిర్చి సాగు మీద నమ్మకం పోయింది. ఈసారి పత్తి సాగు చేశా. ఈలప్రోలు మంగయ్య, కౌలు రైతు, తల్లాడ