మహిళను హత్య చేసిన మాజీ ప్రియుడు

మహిళను హత్య చేసిన మాజీ ప్రియుడు
  • భర్తను విడిచిపెట్టి తనతో రమ్మంటే రాలేదని దారుణానికి ఒడిగట్టిన మాజీ ప్రియుడు
  • జీడిమెట్ల వినాయకనగర్ లో ఘటన

హైదరాబాద్: జీడిమెట్ల పరిధి వినాయక్ నగర్ పరిధిలో దారుణమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని భర్తతో కలసి 3 నెలల క్రితం  హైదరాబాద్ వచ్చిన బీహార్ మహిళను ఆమె మాజీ ప్రియుడే దారుణంగా అంతమొందించాడు. భర్తను వదిలేసి తనతో రమ్మని ఒత్తిడి చేసిన మాజీ ప్రియుడు ఆమె రానని చెప్పడంతో కోపంతో దాడి చేసి కొట్టాడు. బలమైన వస్తువు తీసుకుని కొట్టడంతో ఆమె చనిపోయింది. 
బీహార్ రాష్ట్రానికి చెందిన పూజ (21)కు గత  ఏప్రిల్ నెలలో రాజేంద్రన్ వర్మ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటుండడంతో పూజను  వివాహం చేసుకున్నతర్వాత  హైదరాబాద్ వచ్చి జీడిమెట్లలోనే కొత్త కాపురం పెట్టారు. అయితే భర్త ఇంట్లో లేని సమయాల్లో పూజ తన మాజీ ప్రియుడు రాకేష్ తో చాటింగ్, ఫోన్ మాట్లాడడం ప్రారంభించింది. దీంతో మాజీ ప్రియుడు రాకేష్ మరో స్నేహితుడితో కలిసి  హైదరాబాద్ జీడిమెట్ల లో ఉన్న పూజ ఇంటికి వచ్చాడు. భర్తను వదిలేసి తనతో పాటు బీహార్ కు రావాల్సిందిగా కోరాడు. పూజ నిరాకరించడంతో ఆమెను హత్య చేసి ఆమె ఒంటిపై విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.