
- సీఎం రేవంత్రెడ్డికి శిక్ష పడ్డ నేరస్తుల కుటుంబసభ్యుల వినతి
హైదరాబాద్సిటీ, వెలుగు: క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఏండ్ల తరబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న తమ వారికి క్షమాభిక్షపెట్టి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని జీవిత ఖైదీల కుటుంబసభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖైదీల కుటుంబ సభ్యులు స్వప్న, బీచుపల్లి షరీఫ్, రాజేష్, అనిల్ కుమార్ మాట్లాడారు. క్షణికావేశంలో ఆవేశపూరితంగా చేసిన నేరాలతో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారి పరిస్థితి ఒకలా ఉంటే వారిపై ఆధారపడి జీవితాలు వెల్లదీస్తున్న తమవారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు.
భర్త దూరమై ఒకరు, తండ్రి దూరమై పిల్లలు, సోదరుడు దూరమై మరొకరు, తండ్రి దూరమై పిల్లలు, వృద్ధాప్యంలో వయసులో ఉన్న కొడుకు దూరమై మరికొందరు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించి అక్టోబర్2న గాంధీ జయంతి సందర్భంగా తమ వారికి క్షమాభిక్ష ప్రసాదించి సాధారణ జీవితాన్ని గడిపేలా విముక్తి కల్పించాలని విన్నవించారు.