- సర్కారు ఉత్తర్వులిచ్చినా ప్రైవేటు బడుల్లో దోపిడీ తగ్గట్లే
- స్కూల్కు పోకున్నా డెవలప్మెంట్, స్పెషల్ ఫీజు కట్టాల్సిందేనట
- సర్కారు దృష్టిలోనూ ట్యూషన్ ఫీజంటే ఇవన్నీ కలిపే..
- ఏపీ మాదిరి 30 శాతం ఫీజు తగ్గించాలంటున్న పేరెంట్స్
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులకు సంబంధించి సర్కారు ఇచ్చిన జీవో నంబర్ 46 ఉత్తదే అనిపిస్తోంది. ఆ జీవో ద్వారా స్టూడెంట్ల తల్లిదండ్రులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. స్టూడెంట్లెవరూ బడులకు పోకున్నా స్పెషల్ ఫీజు, స్కూల్ డెవలప్మెంట్ ఫీజు కట్టాల్సిందేనని మేనేజ్మెంట్లు చెబుతున్నాయి. దీంతో ఫీజుల్లో పెద్దగా తగ్గింపేం కనిపించట్లేదు. ఈసారి కూడా పాత జీవో 46నే అమలు చేయాలని సర్కారు ఆలోచిస్తుండటంతో ఫీజులేం తగ్గేలాలేవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో మాదిరి మన దగ్గర కూడా 30 శాతం ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫీజులు తగ్గుతయనుకున్నరు.. కానీ
రాష్ట్రంలోని 10,491 కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 32.23 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఏటా రూ.10 వేల నుంచి రూ.10 లక్షలవరకు ఫీజులను వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్, స్పెషల్, డెవలప్మెంట్ ఫీజులంటూ ఏటా తీసుకుంటున్నాయి. అయితే 2020–21 అకడమిక్ ఇయర్ కరోనా ఎఫెక్ట్తో ఆన్లైన్ క్లాసులను ప్రభుత్వం కొనసాగించింది. 2020–21 అకడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే ఆ ఏడాదికి ఫీజుల వసూళ్లపై జీవో నంబర్ 46 రిలీజ్ చేసింది. 2020–21లో ఫీజులు పెంచొద్దని చెప్పింది. ట్యూషన్ ఫీజును నెలనెలా తీసుకోవాలని ఆర్డర్స్ జారీ చేసింది. దీంతో ఫీజులు తగ్గుతాయని పేరెంట్స్ భావించారు. ఆ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 30 రోజులే క్లాస్ రూముల్లో టీచింగ్ జరిగింది. మళ్లీ కరోనా కేసులు పెరగడంతో మార్చిలోనే స్కూళ్లు మూతపడ్డాయి. అయినా మేనేజ్మెంట్లు పూర్తి స్థాయిలో ఫీజులు వసూలు చేశాయి. బడ్జెట్ స్కూళ్లు మాత్రం తమకు ఫీజులు వసూలు కాలేదని చెప్తున్నాయి.
జీవో నంబర్ 46 ఇచ్చాక కూడా ఏ స్కూల్లోనూ ఫీజులు పెద్దగా తగ్గలేదు. దీనిపై మేనేజ్మెంట్లతో తల్లిదండ్రులు గొడవ పడ్డా జీవో ప్రకారమే తీసుకుంటున్నామని స్పష్టం చేశాయి. అయితే అసలు విషయం ఆలస్యంగా బయపడింది. ట్యూషన్ ఫీజుపై ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 91లో వివరణ స్పష్టంగా ఉంది. ‘‘స్టాఫ్, టీచర్ల జీతభత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, స్కూల్ నిర్వహణ ఖర్చు, ఫెసిలిటీస్ ఖర్చుతో పాటు ఏదైనా స్పెషల్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు..” అన్నీ కలిపి ట్యూషన్ ఫీజుగా నిర్వచనమిచ్చారు. దీంతో సర్కారే అధికారికంగా స్పెషల్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు వసూలు చేసుకోవచ్చని అధికారికంగా ఉత్తర్వలు ఇచ్చినట్టయింది. మేనేజ్మెంట్లు స్పెషల్ ఫీజు పేరుతో శానిటైజేషన్ ఫీజును పిల్లల నుంచి వసూలు చేయగా, డెవలప్మెంట్ ఫీజు ఏటా చెల్లించాల్సిందే. మరోపక్క ఏ స్కూల్లోనూ టీచర్లకు పూర్తిస్థాయి జీతాలు ఇవ్వలేదు. చాలామందిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. 2 లక్షల మందికి పైగా టీచర్లకు సర్కారే నెలకు రూ. 2 వేల భృతి, 25 కిలోల బియ్యం ఇచ్చింది. అలాంటప్పుడు ట్యూషన్ ఫీజు వసూలుకు ఎలా పర్మిషన్ ఇస్తారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.
ఎవ్వరిపైనా చర్యలు తీస్కోలేదు
కరోనా టైమ్లోనూ కార్పొరేట్ స్కూళ్లు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, నెల నెలా కాకుండా ఒకేసారి ఏడాది ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నాయని చాలా మంది పేరెంట్స్ విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 11 స్కూళ్లకు విద్యా శాఖ రెండు సార్లు నోటీసులిచ్చింది. నలుగురు స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్లతో విద్యా శాఖ విచారణ జరిపించింది. రూల్స్ బ్రేక్ చేశారని ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయినా ఇప్పటికీ ఏ స్కూల్పైనా చర్యలు తీసుకోలేదు. హైకోర్టులోనూ దీనిపై సరైనా సమాధానం చెప్పలేక సర్కారు చీవాట్లు తిన్నది. అయినా చలనం లేదు. ఈ ఏడాది కూడా గతేడాది జీవోనే అమలు చేయాలని సర్కారు ఆలోచిస్తోంది. జీవో అవసరం లేదని, ఏపీలో మాదిరి ఫిక్స్డ్ ఫీజులు 30 శాతం లేదా 40 శాతం తగ్గించేలా ఉత్తర్వులివ్వాలని స్టూడెంట్స్ యూనియన్లు, పేరెంట్స్డిమాండ్ చేస్తున్నారు.
జీవో 46ను మార్చి ఇయ్యాలె
జీవో నంబర్ 46 ప్రకారం ట్యూషన్ ఫీజు తీసుకోవాలని ఉంది. కానీ ట్యూషన్ ఫీజంటే స్పష్టత ఇవ్వలేదు. దానికి స్పష్టతనిస్తూ మార్చి ఈ ఏడాది కూడా జీవో 46 అమలు చేయాలె. అట్లాగే ప్రతి స్కూల్కు ట్యూషన్ ఫీజు ఎంతో పేరెంట్స్, స్టూడెంట్లకు తెలిసేలా నోటీసు బోర్డుల్లో, వెబ్సైట్లో పెట్టాలి. కరోనా టైమ్లో మేనేజ్మెంట్లు ఫీజుల దోపిడీని అరికట్టాలి. - నాగటి నారాయణ, టీపీఏ స్టేట్ ప్రెసిడెంట్
ఫీజులో డిస్కౌంట్ ప్రకటించాలె
సర్కారు ఇచ్చిన జీవో 46 గతేడాది అమలు కాలేదు. ఈ ఏడాదీ కొనసాగిస్తే జీవో అమలు కాదనే అనుకోవాలె. మేనేజ్మెంట్లు సర్కారు ఇచ్చిన జీవోను ఎక్కడా అమలు చేయట్లేదు. గతంలో ఫీజులు కట్టకపోతే పిల్లలకు ఆన్లైన్ క్లాసుల లింక్ తీసేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫీజులో డిస్కౌంట్ను సర్కారు ప్రకటించాలి. దాన్ని అన్ని మేనేజ్మెంట్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. - వెంకట్, హెచ్ఎస్పీఏ సెక్రటరీ