తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నారు.
కొలిచినవారి కొంగు బంగారంగా భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది.. శ్రీవారి ఆలయం మీదుగా తరుచూ విమానాలు ఎగురుతూనే ఉండగా.. ఇవాళ (సెప్టెంబర్ 7) కూడా ఆలయ గోపురం మీదుగా మరోసారి ప్రయాణించింది విమానం.. ఆలయం మీదుగా విమానాలు ఎగరకుండా చూడాలంటూ రేణిగుంట విమానాశ్రయం అధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.. దీనికి తోడు.. తిరుమల నో ప్లై జోన్ కాదంటూ ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు చెబుతున్నారు.. ఎయిర్ ట్రాఫిక్ పెరిగితే.. తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదు అన్నట్లుగా ఏటీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. అయితే, తరచూ విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా ఎగరడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండ గగనతలంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే టీటీడీ అభ్యంతరాలను విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి