
- స్కూల్ రీఓపెన్ రోజే విద్యార్థులకు పుస్తకాల అందజేత
- ఇప్పటికే స్కూళ్లకు చేరిన 80 లక్షల టెక్స్ట్బుక్స్
- నాలుగైదు రోజుల్లో మిగిలిన పుస్తకాలు జిల్లాలకు చేరేలా అధికారుల ప్లాన్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూల్స్ తెరిచిన రోజే పాఠ్య పుస్తకాలు అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే 95 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరుకోగా, ఇందులో 60 శాతానికి పైగా బుక్స్ స్కూళ్లకు చేరాయి. మిగిలిన పుస్తకాలు నాలుగైదు రోజుల్లోగా జిల్లాలకు చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 29 వేల సర్కారు, కేజీబీవీలు, మోడల్, యూఆర్ఎస్, గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్లు ఉండగా, వాటిలో 24.44 లక్షల మంది చదువుతున్నారు.
వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ల కోసం 1,40,92,385 పుస్తకాలు అవసరం కాగా, పార్ట్1 సిలబస్ పుస్తకాల ప్రింటింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వాటిలో శుక్రవారం నాటికి 1,33,20,173 (95%) పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, గద్వాల, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ తదితర జిల్లాల్లో 95 శాతానికి పైగా పుస్తకాలు చేరాయి. వీటిని వేగంగా స్కూళ్లకు తరలిస్తున్నారు. 1.33 కోట్లు పుస్తకాల్లో 80 లక్షలకు పైగా పుస్తకాలు స్కూల్ పాయింట్లకు చేరాయి. ఈ నెల 11లోగా అన్ని బడుల్లోకి పుస్తకాలు చేరేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 12న స్కూళ్ల రీఓపెన్ రోజు ప్రజా ప్రతినిధులతో పిల్లలకు పుస్తకాలు అందించనున్నారు.
91 శాతం నోట్ బుక్స్ కూడా..
సర్కారు బడుల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం నోట్ బుక్స్ కూడా అందిస్తోంది. తొలిసారిగా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకు ఈ ఏడాది నుంచి ప్రారంభించింది. వీరి కోసం 1.11 కోట్ల నోట్ బుక్స్ అవసరం కాగా.. ఇప్పటికే 1.01 కోట్ల నోట్స్ను అధికారులు జిల్లాలకు చేర్చారు. జనగామ, భూపాలపల్లి, హైదరాబాద్, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు మినహా.. మిగిలిన జిల్లాలకు వంద శాతం నోట్ బుక్స్ పంపిణీ చేశారు. వాటిని కూడా స్కూళ్ల రీఓపెన్ రోజే స్టూడెంట్లకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.