
- రూ.430 కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్సిటీ, వెలుగు: మీరాలం ట్యాంక్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.430 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి గురువారం అనుమతి ఇచ్చింది. ప్రపంచ స్థాయి హంగులతో శాస్త్రిపురం నుంచి బెంగళూరు హైవేకు కలుపుతూ హెచ్ఎండీఏ, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి ఈ బ్రిడ్జిని నిర్మించనున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు అవసరమైన మరికొన్ని హంగులు కూడా ఇక్కడ నిర్మించనున్నారు. దీని కోసం ఇప్పటికే ఓ ప్రైవేట్కన్సల్టెన్సీకి డీపీఆర్ కోసం పనులు అప్పగించినట్టు అధికారులు తెలిపారు.
మీరాలం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయంటున్నారు. ఇందులో పశ్చిమాన దక్కన్ పార్క్ నుంచి తూర్పున బెంగళూరు జాతీయ రహదారి మధ్య బ్రిడ్జిని నిర్మించడం వల్ల దక్కన్ పార్కు నుంచి చింతల్మెట్ వైపు వంతెనకు డౌన్ ర్యాంపు నిర్మిస్తారు. అలాగే కిషన్బాగ్నుంచి వంతెన పైకి వెళ్లడానికి అప్ ర్యాంపు నిర్మించనున్నారు. దీని వల్ల జాతీయ రహదారి నుంచి బహదూర్పురా, అత్తాపూర్ వైపు నుంచి రాకపోకలు సులువు కానున్నట్టు అధికారులు వెల్లడించారు.