మనం వంటగదిలో ఏదైనా ఆహారం, పండ్లు, కూరగాయలు తాజాగా ఉండటానికి సాధారణంగా ప్లాస్టిక్ కవర్లు లేదా అల్యూమినియం ఫాయిల్ వాడుతుంటాం. కానీ ఇప్పుడు వీటికి బదులుగా 'తేనె మైనం (Beeswax)'తో తయారు చేసిన ర్యాప్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. 2008లో కెనడాకు చెందిన టోనీ డెస్రోసియర్స్ అనే పోషకాహార నిపుణురాలు దీనిని సృష్టించారు.
ఎలా తయారవుతుంది?
ఇది చూడటానికి ఒక గుడ్డ ముక్కలా ఉంటుంది. సేంద్రీయ పత్తి (Organic Cotton) లేదా జనపనార వస్త్రంపై తేనె మైనం, చెట్టు జిగురు, జోజోబా నూనె పూసి దీనిని తయారు చేస్తారు. ఇది ప్లాస్టిక్ లాగా పర్యావరణానికి హాని చేయదు.
దీని ప్రత్యేకతలు:
ప్లాస్టిక్ లాగా ఆహారాన్ని పడవనివ్వకుండా పండ్లు, కూరగాయలను సహజంగా ఎక్కువరోజులు ఉండేలా చేస్తూ, కాస్త గాలి ఆడేలా చేస్తుంది. దీనివల్ల ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. దీనిని ఒక్కసారి కొని.. సరిగ్గా వాడితే ఏడాది కంటే ఎక్కువ కాలం వస్తుంది. మీరు ఏదైనా పండ్లను లేదా గిన్నెనో మూయాలనుకున్నప్పుడు, ఈ షీట్ను దానిపై ఉంచి చేతులతో కొద్దిగా మలిచి నొక్కితే చాలు. మీ చేతి వెచ్చదనానికి అది ఆ గిన్నె ఆకృతికి తగ్గట్టుగా అతుక్కుపోతుంది. దీని వాడుకకాలం అయిపోయిన తర్వాత, దీనిని పారేయకుండా కంపోస్ట్గా/ఎరువుగా మార్చుకోవచ్చు.
►ALSO READ | 40 డిగ్రీల ఎండలో తిరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? నరాల డాక్టర్ చెప్పింది ఇదే !
ఎంత కాలం తాజాగా ఉంటాయి?
*కోసిన అవకాడో పండు అయితే 4-5 రోజుల వరకు నల్లబడకుండా ఉంటుంది.
*నిమ్మకాయ ముక్కలు అయితే 14 రోజుల వరకు తాజాగా ఉంటుంది.
*ఆకుకూరలు అయితే రెండు వారాల వరకు పాడవకుండా ఉంటాయి.
*చీజ్, బ్రెడ్ గట్టిగా అవకుండా మెత్తగా ఉంటాయి.
జాగ్రత్తలు, ధర:
దీనిని శుభ్రం చేయడానికి కేవలం చల్లటి నీరుతో కడిగి ఆరబెట్టాలి. అయితే దీనిని వేడి నీటితో కడగకూడదు. అలాగే మైక్రోవేవ్ ఓవెన్లలో లేదా డైరెక్ట్ మంట దగ్గర వాడకూడదు ఎందుకంటే వేడికి మైనం కరిగిపోతుంది. ధర విషయానికి వస్తే మూడు షీట్లు ఉన్న ప్యాక్ సుమారు 6 డాలర్లు అంటే దాదాపు రూ.500 పైనే ఉంటుంది. మొదట కాస్ట్లీ అనిపించినా, ఏడాది పాటు వాడుకోవచ్చు కాబట్టి ప్లాస్టిక్ కంటే ఇదే బెటర్. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఇదొక గొప్ప ప్రత్యామ్నాయం!
