ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) విభాగంలోని ఉద్యోగుల కోసం కొత్తగా 'వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజ్' (VEP) ప్రకటించింది. అంటే, కంపెనీ పద్ధతులు నచ్చని వారు లేదా బయటకు వెళ్లాలనుకునే వారు స్వయంగా తప్పుకోవచ్చు. ఇంకా వారికి కంపెనీ మంచి సెటిల్మెంట్ ప్యాకేజీని కూడా ఇస్తుంది.
గూగుల్ ఎందుకు ఇలా:
గూగుల్ ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఉద్యోగులకు పంపిన మెమోలో కొన్ని కీలక విషయాలు చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఈ వేగాన్ని తట్టుకోగలిగే వారు మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇంకా భవిష్యత్తు అంతా AIతోనే ఉంటుంది. దీనిని అంగీకరించని వారు లేదా ఈ పని ఒత్తిడిని ఆస్వాదించలేని వారు ఉద్యోగం తప్పుకోవచ్చని గూగుల్ ఆఫర్ ఇచ్చింది.
ఈ అఫర్ సేల్స్, సొల్యూషన్స్ టీమ్స్, కార్పొరేట్ డెవలప్మెంట్ విభాగాల్లోని వారికీ అందిస్తుంది. కస్టమర్లతో నేరుగా సంబంధం ఉన్న సేల్స్ టీమ్స్ ఈ ఆఫర్కు అర్హులు కారు. ఎందుకంటే వారు వెళ్తే కస్టమర్లకు ఇబ్బంది కలుగుతుందని కంపెనీ భావిస్తోంది.
గత ఏడాది కాలంలో గూగుల్ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇది మూడోసారి. జూన్ 2025లో రిటర్న్ తో ఆఫీస్ అనే రూల్ తెచ్చినప్పుడు కొంతమందికి ఇలాంటి ప్యాకేజీ ఇచ్చారు. అక్టోబర్ 2025లో యూట్యూబ్ విభాగంలో మార్పులు చేసినప్పుడు కూడా కొందరికి ఇలాంటి ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం AI లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను మార్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తోంది.
గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సిక్కోనీ ప్రకారం.. ఇప్పటికే దాదాపు 5% మంది ఉద్యోగులు ఈ వాలంటీర్ ఎగ్జిట్ ప్యాకేజ్ తీసుకున్నారు. కుటుంబ బాధ్యతలు ఉన్నవారు లేదా కెరీర్లో బ్రేక్ కోరుకునే వారు ఈ ప్యాకేజీ తీసుకుని హ్యాపీగా వెళ్తున్నారని ఆమె తెలిపారు.
