V6 News

గ్లోబల్ సమిట్ కాదు.. గోబెల్స్ సమిట్ : హరీశ్

గ్లోబల్ సమిట్ కాదు.. గోబెల్స్ సమిట్ : హరీశ్
  • ఫ్యూచర్​ సిటీ  పేరిట ఫేక్​ పెట్టుబడులు తెస్తున్నరు: హరీశ్​
  • ప్రజాభవన్​ కాంగ్రెస్​ నేతల విందులు, జల్సాలకు అడ్డాగా మారింది
  • కాంగ్రెస్​ రెండేండ్ల పాలనపై 
  • చార్జ్​షీట్​ విడుదల

హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల రేవంత్​ పాలన ప్రజలకు శాపంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. రేవంత్​ ఊదరగొడుతున్న ఫ్యూచర్​ సిటీ.. కేసీఆర్​ భూములు సేకరించిన ఫార్మా సిటీవేనన్న విషయం ప్రజలు మర్చిపోరన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్నది గ్లోబల్​ సమిట్​ కాదని.. గోబెల్స్​ సమిట్​గా మారిస్తే బాగుంటుందన్నారు. సోమవారం తెలంగాణ భవన్​లో రెండేండ్ల కాంగ్రెస్​ పాలనపై హరీశ్ చార్జ్​షీట్​ను విడుదల చేసి మాట్లాడారు. కాంగ్రెస్​కు ప్రజలు ఇచ్చిన సమయంలో సగం పూర్తయిందని అన్నారు. ఇక మిగిలింది రెండేండ్లేనని, చివరి ఏడాదంతా ఎన్నికల హడావుడి, ఎలక్షన్ కోడ్​తోనే సరిపోతుందని చెప్పుకొచ్చారు. రాబోయే రెండేండ్లలో సాధించే ఫలితాల కోసం.. తొలి రెండేండ్లలో ఏమైనా పునాది పడిందా అని ప్రశ్నించారు.

 సీఎం ఆఫీసులో రోజూ ప్రజల్ని కలుస్తం.. ప్రజాదర్బార్​ నిర్వహిస్తమని మేనిఫెస్టోలో పెట్టారని.. కానీ, ఒక్కరోజు బాగోతంగానే మిగిల్చారని మండిపడ్డారు. ‘‘ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి తానే స్వయంగా ప్రతీరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తానని రేవంత్ గప్పాలు కొట్టిండు. ప్రజాదర్బార్ పక్కపొంటే ఉండే డిప్యూటీ.. ప్రజాదర్బార్​లో వచ్చే ఫిర్యాదుల గురించి ఏ రోజూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ప్రజాభవన్ సీఎల్పీ మీటింగ్ లు పెట్టుకొని పార్టీ మీటింగ్ లకు అడ్డాగా మారింది’’ అని ఆయన పేర్కొన్నారు.

సీఎం, మంత్రుల భారీ స్కామ్​లు

ప్రజా పాలనలో సీఎం, మంత్రులు భారీ కుంభకోణాలకు  పాల్పడుతున్నారని హరీశ్​ రావు మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేని చేతగాని సర్కారు.. పాలసీల పేరుతో తమ అవినీతిని చట్టబద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు.  హైడ్రా పేరిట విలువైన భూములను కొల్లగొట్టే స్కామ్​కు తెరలేపారన్నారు.