నైజీరియా డ్రగ్‌‌ సప్లయర్ల అరెస్టు

నైజీరియా డ్రగ్‌‌ సప్లయర్ల అరెస్టు
  • 150 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌ సిటీ పోలీసులు డ్రగ్‌‌ ట్రాఫికింగ్‌‌పై దాడి చేసి ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేశారు. హెచ్‌‌న్యూ, టోలిచౌకి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌‌లో 150 గ్రాముల ఎండీఎంఏ పట్టుబడింది. దీని విలువ రూ.20 లక్షలుగా అంచనా వేశారు. హెచ్‌‌న్యూ డీసీపీ వైభవ్‌‌ గైక్వాడ్‌‌ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. చిడి ఈజెహ్‌‌ 2014లో మెడికల్‌‌ అటెండెంట్‌‌ వీసాపై భారత్‌‌కు వచ్చి, వీసా గడువు ముగిసిన తరువాత అక్రమంగా ఉండి డ్రగ్స్‌‌ వ్యాపారంలోకి దిగాడు. గతంలో 130 గ్రాముల కొకైన్‌‌, 32 గ్రాముల ఎండీఎంఏ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై నకిలీ పేరుతో ఆధార్‌‌, పాన్‌‌, డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌ పొందాడు.

ఢిల్లీలోని ‘క్రిస్‌‌’ అనే నైజీరియన్‌‌ నుంచి డ్రగ్స్‌‌ సేకరించి హైదరాబాద్‌‌, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో సరఫరా చేస్తున్నాడు. టోలిచౌకి పరిధిలో 150 గ్రాముల ఎండీఎంఏతో శుక్రవారం పట్టుబడ్డాడు. ఇతడికి సహకరిస్తున్న మరో నిందితుడు ఒబాసి జేమ్స్‌‌ విక్టర్‌‌ ను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు. మొబైల్‌‌ ఫోన్‌‌, నకిలీ గుర్తింపు పత్రాలు, బ్యాంక్‌‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్‌‌ ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్‌‌ డెలివరీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని డీసీపీ తెలిపారు. సమావేశంలో ఇన్‌‌స్పెక్టర్‌‌ డేనియల్‌‌, ఎస్‌‌ఐ వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.