
- యూఎస్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిక
- ఇన్వెస్టిగేషన్కు ఆదేశించిన అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్
- నిందించడానికేనని కొట్టిపారేసిన చైనా ఫారిన్ మినిస్ట్రీ
న్యూయార్క్: కరోనా వైరస్ మూలాలు కనుక్కోకపోతే మరిన్ని వేవ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కొవిడ్–19 ఆనవాళ్లు కనిపెట్టలేకపోతే కొవిడ్–26, కొవిడ్–32 కూడా వస్తాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీకైనట్లు ఆధారాలు బలపడుతున్నాయని అమెరికా సైంటిస్ట్ స్టాట్ గాట్లిబ్ చెప్పారు. ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా గాట్లిబ్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఫైజర్ కంపెనీ బోర్డులో మెంబర్గా ఉన్నారు. కరోనాను ఎదుర్కోవాలంటే చైనా సపోర్ట్ కావాలని, ఫ్యూచర్లో ఇటువంటి మహమ్మారులను ఎదుర్కోవాలంటే ఈ చర్యలు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అవ్వలేదని చెప్పడానికి చైనా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు.
జంతువుల నుంచి మనుషులకి..
వైరస్ మూలాలు తెలుసుకోలేకపోతే భవిష్యత్తులో మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెక్సస్ చిల్డ్రన్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కో డైరెక్టర్ పీటర్ హోటెజ్ చెప్పారు. కొవిడ్–19 ఎక్కడ పుట్టిందో స్పష్టంగా తెలియకపోతే కొవిడ్–26, కొవిడ్–32 కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. చైనా వుహాన్లోని సీ ఫుడ్ మార్కెట్లో కొత్త వైరస్ వ్యాపిస్తున్నట్టు గుర్తించిన ఏడాదిన్నర తరువాత కూడా దాని మూలాలు అస్పష్టంగా ఉన్నాయి. అడవి జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. వైరస్ ల్యాబ్ నుంచే లీకైందని కొంతమంది రిపబ్లికన్లు చేసిన ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టిసారించారు. కరోనా మూలాలపై డిటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని యూఎస్ ఇంటెలిజెన్స్ను బైడెన్ ఆదేశించారు. ఎంక్వైరీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ప్రయత్నాలను రెట్టింపు చేయాలని, 90 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని చెప్పారు.
ఆరు నెలలు విచారణకు పర్మిషన్ ఇవ్వాలె
వైరస్ మూలాలను గుర్తించడానికి చైనాలో ఎక్కువ కాలం విచారణ చేయడానికి సైంటిస్టులను అనుమతించాలని పీటర్ హోటెజ్ కోరారు. అక్కడి జంతువులు, మనుషుల నుంచి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలన్నారు. ఆంక్షలు విధిస్తామని బెదిరించి అయినా ఈ పనిచేయాలన్నారు. సైంటిస్టులు, ఎపిడమాలజిస్ట్లు, వైరాలజిస్టులు, బ్యాట్ ఎకాలజిస్ట్ పరిశోధకులు హుబే ప్రావిన్సులో సుమారు 6 నెలలు ఉండాలని హోటెజ్ చెప్పారు.