హేగ్: ఉక్రెయిన్లో మిలిటరీ ఆపరేషన్లన్నింటినీ ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) రష్యాను ఆదేశించింది. ‘‘ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ భూభాగంలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్లను రష్యన్ ఫెడరేషన్ వెంటనే నిలిపివేయాలి”అని ఐసీజే న్యాయమూర్తులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 13–2 ఓటింగ్తో ఐసీజే న్యాయమూర్తులు ఆదేశాలిచ్చారు. రష్యా, చైనా న్యాయమూర్తులు ఈ ఆదేశాలతో ఏకీభవించలేదు. ఇది స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని ఐసీజేలో రష్యా సమర్థించుకుంది. ఐసీజే ఆదేశాలను పాటించని దేశాలను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కు రిఫర్ చేస్తారు.
అక్కడ రష్యా వీటో అధికారాన్ని కలిగి ఉంది. అయితే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను స్వాగతించారు. రష్యాకు వ్యతిరేకంగా ఐసీజేలో ఉక్రెయిన్ పూర్తిస్థాయి విజయం సాధించిందని, రష్యా ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని డిమాండ్ చేశారు. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ ఉక్రెయిన్ అంతర్జాతీయ కోర్టుకెక్కింది. 1948 నాటి జినోసైడ్ కన్వెన్షన్ను రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. గతవారం జరిగిన విచారణకు రష్యా హాజరు కాలేదు. ఆ తర్వాత రాతపూర్వక వాదనను సమర్పించిన రష్యా.. ఈ కేసును విచారించే పరిధి అంతర్జాతీయ కోర్టుకులేదని పేర్కొంది. అయితే, జీనోసైడ్ కన్వెన్షన్కు సంబంధించిన సమాచారం ఆధారంగా ప్రాథమిక నిర్ణయం తీసుకోవచ్చని ప్రిసైడిండ్ జడ్జి జాన్ డోనోగ్ స్పష్టం చేశారు.