ఐటీడీఏ మీటింగ్ ఎప్పుడో?.. 16 నెలలుగా జరగని ఖమ్మం పాలకమండలి సమావేశం

ఐటీడీఏ మీటింగ్ ఎప్పుడో?.. 16 నెలలుగా జరగని ఖమ్మం పాలకమండలి సమావేశం
  • మూన్నెళ్లకోసారి జరగాల్సినా పట్టించుకుంటలేరు.. 
  • ఏజెన్సీకి వర్షాకాలంలోనే కష్టకాలం..
  • రహదారులు, విద్య, వైద్యం, తాగునీటి.. తదితర ప్రాబ్లమ్స్
  • సమస్యల పరిష్కారం కోసం యాక్షన్​ ప్లాన్ ​తయారీకి ఈ సమావేశమే కీలకం

భద్రాచలం, వెలుగు  : భద్రాచలం ఐటీడీఏలో పాలకమండలి మీటింగ్​నిర్వహణలో నిబంధనలను బేఖాతర్​ చేస్తున్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన ఈ మీటింగ్​ను 16 నెలలుగా జరపడం లేదు. ఏజన్సీలో గిరిజనుల సమస్యలు కోకొల్లుగా పేరుకుపోతున్నాయి. వర్షాకాలం రావడంతో ఏజెన్సీకి కష్టకాలం మొదలైంది. ఒకవైపు రహదారులు, విద్య, వైద్యం, సాగు, తాగునీరు.. మరోవైపు వరదలు, వ్యాధులు ముసురుకునే అవకాశం ఉంటుంది. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ఆఫీసర్లు చర్చించి  యాక్షన్​ ప్లాన్​ తయారు చేయడానికి ఈ మీటింగ్​ దోహదపడుతుంది. 

ప్రజాప్రతినిధులు లేరు.. ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు.. 


ఐటీడీఏ పాలకమండలి మీటింగ్​కు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రావాలి. కానీ సర్పంచ్​లు, ఎంపీపీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఆయా మండలాల్లో నెలకొన్ని ఉన్న సమస్యలను వీరే గుర్తించి మీటింగ్​కు వచ్చి ఆదివాసీల తరుఫున ఏకరవు పెడతారు. ఆదివాసీల గొంతుకను ఐటీడీఏలో ఆఫీసర్లకు వినిపించే దిక్కే లేకుండా పోయింది. స్పెషల్​ ఆఫీసర్ల ద్వారా అయినా సమస్యలు తెలుసుకునేందుకు ఐటీడీఏ  ప్రయత్నించడం లేదు. 

కొత్తపథకాలు.. దండిగా నిధులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు నిధులు దండిగా వచ్చాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని నాలుగు లక్షల మంది ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్​ కృషి చేస్తోంది. 2.10లక్షల గిరిజన రైతులకు అటవీహక్కుల చట్టం ద్వారా లభించిన ఆరు లక్షల ఎకరాల భూమికి ఇందిరా సౌర గిరి జల వికాసం స్కీం ద్వారా సాగునీరందించేందుకు ఐదేండ్ల కాలానికి రూ.12,600 కోట్లు రిలీజ్​ చేశారు. ఈ సంవత్సరం 2,921 మంది రైతులకు బోర్లు, సోలార్​ ప్యానెళ్లు, మోటార్లను ఉచితంగా అందించి 8,046 ఎకరాల పోడు భూమిని సాగులోకి తీసుకురానున్నారు.

 ఇందుకు ఈ ఒక్క సంవత్సరమే రూ.193.19కోట్లను ఖర్చు చేయనున్నారు. భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు, వైరా నియోజకవర్గాల్లోని 274 మంది కొండరెడ్లతో పాటు, 4,750 మంది ఇతర ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. రూ.5లక్షల చొప్పున రూ.251.20కోట్లను ఇందుకు ఖర్చు చేస్తారు. రాజీవ్​ యువ వికాసం ద్వారా 11,311 యూనిట్లకు రూ.123.36కోట్లను వెచ్చించేందుకు సర్కారు నిధులు కేటాయించింది. 

రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు క్యాటగిరీల వారీగా గిరిజన నిరుద్యోగులకు సెప్టెంబరులోగా ఈ పథకం ద్వారా మంజూరు చేస్తారు. అయితే నిబంధనల ప్రకారం ఆదివాసీల కోసం ఖర్చు చేసే ప్రతీ పైసా గురించి గవర్నరింగ్​ బాడీలో చర్చించి, మీటింగ్​ తీర్మానం తీసుకోవడం తప్పనిసరి. ఇప్పటికైనా ప్రభుత్వం తరుఫున వస్తున్న నిధులు, వ్యయం విషయాలపై పారదర్శకత కోసం అయినా గవర్నింగ్​బాడీ మీటింగ్​ను నిర్వహించాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతున్నారు.