కెప్టెన్సీ నేనే వద్దన్నా .. పని భారమే అందుకు కారణం: బుమ్రా

కెప్టెన్సీ నేనే వద్దన్నా .. పని భారమే అందుకు కారణం: బుమ్రా

లండన్‌‌‌‌‌‌‌‌: టీమిండియా కెప్టెన్సీ, అందులోనూ టెస్టు జట్టుకు నాయకత్వం వహించడం అంటే ఒక ఆటగాడికి లభించే అత్యున్నత గౌరవంగా భావిస్తారు. అలాంటి గోల్డెన్ చాన్స్‌‌‌‌‌‌‌‌ను ఇండియా స్టార్ పేసర్ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా వద్దనుకున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్టు పగ్గాలు చేపట్టే అవకాశం తనకు వచ్చినా పనిభారం కారణంగా సున్నితంగా తిరస్కరించినట్లు బుమ్రా స్వయంగా వెల్లడించాడు. మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌‌‌‌‌‌‌‌తో 'స్కై స్పోర్ట్స్'కు ఇచ్చిన స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూలో బుమ్రా ఈ విషయాన్ని పంచుకున్నాడు. తాను కెప్టెన్సీ ఆశించినా ఇవ్వలేదని వచ్చిన వార్తలను బుమ్రా కొట్టిపారేశాడు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే ముందే తన ఉద్దేశాన్ని బీసీసీఐకి తెలిపానని స్పష్టం చేశాడు.

 ‘ఇందులో ఎలాంటి కట్టుకథలు లేవు. నాకు కెప్టెన్సీ ఇవ్వలేరన్న  వార్తలు, వివాదాలు అవాస్తవం. ఐపీఎల్ సమయంలోనే ఇంగ్లండ్‌‌తో రాబోయే ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌లో నా వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ గురించి బీసీసీఐతో చర్చించాను. నా వెన్ను గాయాన్ని పర్యవేక్షించిన ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌, నాకు సర్జరీ చేసిన డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడా మాట్లాడాను. కెరీర్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని పనిభారం విషయంలో ఎంత తెలివిగా ఉండాలో వాళ్లు నాకు స్పష్టంగా చెప్పారు. ఆ చర్చల తర్వాత నేను మరింత జాగ్రత్తగా ఉండాలని డిసైడయ్యా. వెంటనే  బీసీసీఐకి ఫోన్ చేసి  కెప్టెన్సీ  కోసం నన్ను పరిగణించవద్దన్నా. 

ఎందుకంటే ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో అన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడటం నాకు సాధ్యం కాకపోవచ్చు’ అని బుమ్రా వెల్లడించాడు.  సీనియర్ పేసర్ బుమ్రా స్వయంగా రేసు నుంచి తప్పుకోవడంతో రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత యంగ్ బ్యాటర్ శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్‌‌‌‌‌‌‌‌ను ఇండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా సెలెక్టర్లు నియమించారు. శుక్రవారం లీడ్స్‌‌‌‌‌‌‌‌లోని హెడింగ్లీ గ్రౌండ్‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌తో గిల్ కెప్టెన్సీ శకం మొదలుకానుంది.

ఎల్లప్పుడూ జట్టుకే నా ఓటు

రాబోయే లాంగ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో మధ్యలో కెప్టెన్ మారితే అది జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని బుమ్రా అభిప్రాయపడ్డాడు. ‘బీసీసీఐ నన్ను నాయకత్వ పాత్రలో చూసింది. కానీ నేను వద్దని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అది జట్టుకు కూడా న్యాయం కాదు. ఒక సిరీస్‌‌‌‌‌‌‌‌లో మూడు టెస్టులకు ఒకరు,  రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు మరొకరు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఉండటం జట్టుకు ఏమాత్రం మంచిది కాదు. నేను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తాను. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా కన్నా ఒక ముఖ్యమైన ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జట్టుకు నా సేవలు ఎక్కువ అవసరం. కెప్టెన్సీ అనేది ఒక పొజిషన్‌‌‌‌‌‌‌‌. కానీ జట్టులో ఎప్పుడూ లీడర్లు ఉంటారు. 

నేను ఆ పాత్ర పోషించాలనుకున్నా. నేను జాగ్రత్తగా ఉండకపోతే నా ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ ఫార్మాట్ నుంచి నేను అకస్మాత్తుగా తప్పుకోవాల్సిన పరిస్థితి రావాలనుకోవడం లేదు’ అని బుమ్రా స్పష్టం చేశాడు. తనకు  టెస్టు కెప్టెన్సీ కంటే క్రికెట్‌‌‌‌‌‌‌‌ అంటేనే ఎక్కువ ప్రేమ అన్నాడు.  ‘కెప్టెన్సీ నాకు చాలా ముఖ్యమైనది. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ,   కొన్నిసార్లు మనం దూరదృష్టితో ఉండాలి. నేను కెప్టెన్సీ కంటే క్రికెట్‌‌‌‌‌‌‌‌ను ఎక్కువగా ప్రేమిస్తున్నా. కాబట్టి నేను ఒక క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా, ఒక ఆటగాడిగా జట్టుకు మరింత సేవ  చేయాలనుకుంటున్నాను. నాకూ ఆశయాలు ఉన్నాయి. కానీ పరిస్థితి ఇలా ఉంది. అందుకే నన్ను నాయకత్వ పాత్రలో చూడవద్దని చెప్పాను’అని  బుమ్రా వివరించాడు.

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో మూడు టెస్టులే ఆడతా

తన వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో కనీసం మూడు టెస్టులు ఆడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు బుమ్రా తెలిపాడు. తొలి టెస్టులో ఆడటం ఖాయమని స్పష్టం చేశాడు. ‘సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఎన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, మొదటి టెస్టులో నేను కచ్చితంగా ఆడుతున్నాను. ఆ తర్వాత పరిస్థితి, నా వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ ఎలా ఉందో చూసి మిగతా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల గురించి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి నేను మూడు టెస్టులు ఆడగలనని భావిస్తున్నాం’ అని చెప్పాడు.  కాగా,  సిరీస్ కోసం ఇంగ్లండ్ బయల్దేరే ముందు కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బుమ్రా మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనే బరిలోకి దిగే చాన్స్ ఉందని చెప్పాడు.