- ఎవరి భిక్ష కాదు.. అమరుల త్యాగఫలం, ప్రజల ఆత్మగౌరవం
- బీజేపీ నేతలకు తెలంగాణను అవమానించడం అలవాటుగా మారిందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇది బీజేపీ అహంకారానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్అయ్యారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై గురువారం ఒక ప్రకటనలో కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అస్తిత్వంపై బీజేపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, పదేపదే రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరుల త్యాగాలను అవమానించడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాలతోనో లేదా భిక్ష వల్లో ఏర్పడలేదు. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందింది. అస్తిత్వం కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదంతో పోల్చడం బీజేపీ కుసంస్కారాన్ని బయటపెడుతోంది" అని కేటీఆర్ విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ఎంపీలు ఏం చేస్తున్నరు?
పార్లమెంటులో తెలంగాణను అవమానిస్తున్నా అక్కడే ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలతో పాటు, కాంగ్రెస్ ఎంపీలు కూడా మౌనంగా ఉండటం సిగ్గుచేటని కేటీఆర్అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమా అని ప్రశ్నించారు.తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘సర్’పై జాగ్రత్తగా ఉండండి: పార్టీ శ్రేణులకు పిలుపు
రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బీజేపీ, కాంగ్రెస్లు అక్రమాలకు పాల్పడకుండా బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తరఫున త్వరలోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

