- నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీలో టీఎంసీ విలీనం
- రెబెల్ నేతల లీడర్ కకోలీ ఘోష్ వెల్లడి
- స్పీకర్తో 20 మంది ఎంపీల భేటీ
- లోక్సభలో ప్రత్యేక సీటింగ్కు వినతి
- ఎన్డీయే కూటమిలో, మోదీ నాయకత్వంలో పనిచేస్తామని వివరణ
న్యూఢిల్లీ/కోల్కతా: ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ)లో మెర్జ్ అవుతున్నాం.. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం”.. అంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ రెబెల్ ఎంపీలు ఆదివారం వెల్లడించారు. ఈమేరకు సీనియర్ నేత కకోలీ ఘోష్ దస్తిదార్ ఆధ్వర్యంలో 20 మంది ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్నారు. మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్న తమదే అసలైన టీఎంసీ అని గుర్తించాలని కోరారు. లోక్ సభలో తాము విడిగా కూర్చునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు స్పీకర్కు ఓ వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పనిచేయాలని తామంతా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ (ఎన్సీపీ) కి బెంగాల్లోనూ కొంత ఉనికి ఉంది.స్పీకర్ ఓం బిర్లాను కలిసిన వారిలో సుదీప్ బందోపాధ్యాయ్, కాకొలి ఘోష్ దస్తీదార్లతో పాటు రచనా బెనర్జీ, జగదీష్ చంద్ర బర్మా, పార్థా భౌమిక్, అరూప్ చక్రవర్తి, దీపక్ అధికారి (దేవ్), సయానీ ఘోష్, బాపి హల్దార్, అబు తాహెర్ ఖాన్, కాళీపద సోరెన్, అసిత్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం తమ వర్గంలో తిరుగుబాటు ఎంపీల సంఖ్య 22కు చేరిందని కాకొలి ఘోష్ దస్తీదార్ ప్రకటించారు. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడు సుదీప్ బందోపాధ్యాయ్ కూడా రెబల్ క్యాంపులోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
రెబల్ ఎంపీలపై చర్యలు..
రెబల్ ఎంపీలపై టీఎంసీ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తృణమూల్ యువ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి సయానీ ఘోష్ను, మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న మాలా రాయ్ను, నార్త్ కోల్కతా జిల్లా అధ్యక్ష పదవి నుంచి సుదీప్ బందోపాధ్యాయ్ను తమ పదవుల నుంచి తొలగించింది. మరోవైపు, పార్లమెంటులో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంగీకరించబోదని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ స్పష్టం చేశారు.
