
- ఫార్చ్యూనర్ కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు
- ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ వెల్లడి
మణుగూరు, వెలుగు: ఓ ముఠా కారులో గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ పట్టుకుంది. రూ. 13 లక్షల విలువైన 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి తెలిపిన ప్రకారం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండ్ తిరుపతి ఆదేశాలతో ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ రమేశ్ సిబ్బందితో మణుగూరు హనుమాన్ టెంపుల్ సమీపంలోని రథం గుట్ట అర్బన్ పార్క్ వద్ద గురువారం తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వచ్చిన ఫార్చ్యూనర్ కారును ఆపి చెక్ చేశారు. అందులో 21.5 కేజీల గంజాయి దొరికింది. కారులోని ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు.
హైదరాబాద్ కు చెందిన షేక్ సమీర్, సయ్యద్ అబుబాకర్, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరవంచ గ్రామానికి చెందిన తానంకి ప్రవీణ్, కోట హరీశ్, షేక్ యశ్వంత్ కుమార్ గా గుర్తించారు. నిందితులు ముఠాగా ఏర్పడి ఒడిశాలోని మల్కానగిరి నుంచి హైదరాబాద్ పాతబస్తీకి గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ చెప్పారు.