
ఖమ్మం టౌన్, వెలుగు : గత నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పని చేసే పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ లు డిమాండ్చేశారు. మంగళవారం హాస్పిటల్ ఎదుట ఆందోళన కొనసాగించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్, రాష్ట్ర డీఎంఈకి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కార్మికులు ధర్నా చేస్తున్న సమయంలోనే సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ పోలీస్ అధికారుల సహాయంతో వార్డుల్లోని చెత్తను తొలగించేందుకు కేఎంసీ కార్మికులను తీసుకొచ్చారు.
దాంతో బయటి కార్మికులతో చెత్తను శుభ్రం చేయిస్తే ఊరుకునేది లేదని, తమ సమస్యను అధికారులు పరిష్కరించాలని అధికారులతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంసీహెచ్ గేటు ఎదుట స్వల్ప తోపులాట జరిగింది. కార్మికుల ఆందోళనకు సీఐటీయూ నుంచి తుమ్మ విష్ణు, ఇఫ్ట్ నుంచి జి.రామయ్య మద్దతుగా నిలిచారు. నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు.