
- చివరి దశలో ఉన్నవాటికి ప్రాధాన్యత ఇవ్వండి
- ఐదు కలెక్టరేట్లు త్వరగా పూర్తి చేయాలె
- ఆర్ అండ్ బీ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ పరిధిలో కొనసాగుతున్న రోడ్లు, కలెక్టరేట్లు, టిమ్స్ బిల్డింగ్స్, ఆర్వోబీ పనుల్లో వేగం పెంచాలని ఆ శాఖ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. నిత్యం ప్రజలకు అవసరం ఉండే రోడ్ల పనుల్లో చివరి దశకు చేరుకున్న వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలన్నారు. ఆదివారం సెక్రటేరియెట్ లో ఆర్ అండ్ బీ ఈఎన్సీ తిరుమల, సీఈలు రాజేశ్వర్ రెడ్డి, జయభారతి, మోహన్ నాయక్, లక్ష్మణ్ తో మంత్రి కోమటిరెడ్డి రివ్యూ చేపట్టారు.
పెండింగ్ లో ఉన్న 5 జిల్లా కలెక్టరేట్లు ఆదిలాబాద్, వరంగల్, ములుగు, నారాయణపేట, కరీంనగర్ పనుల పురోగతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటి నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకరాగా, ఈ అంశంపై సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడి త్వరగా బిల్లులు రిలీజ్ అయ్యేలా కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. వర్క్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న వరంగల్, ములుగు జిల్లా కలెక్టరేట్లు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు.
ఆర్వోబీల నిర్మాణంపై ఆరా తీసిన మంత్రి నిజామాబాద్ మాధవనగర్ ఆర్వోబీ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో 91లక్షల వెహికిల్స్ ట్రాఫిక్ ఉందని, రూరల్ నూ రోజు రోజుకు పెరుగుతున్నదని ఇందుకు అనుగుణంగా రోడ్ల కనెక్టివిటీ, రిపేర్లు పూర్తి చేయాలని మంత్రి వెంకట్రెడ్డి ఆదేశించారు.