
- వామపక్షాల డిమాండ్
- అమెరికా మద్దతుతోనే ఊచకోత జరుగుతున్నదని ఫైర్
- 19న పాలస్తీనా సంఫీుభావ దినం నిర్వహించాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర వైమానిక దాడులకు పాల్పడుతూ మారణహోమాన్ని సృష్టిస్తోందని, దీన్ని తక్షణమే ఆపాని వామపక్షాలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన వామపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే దాదాపు 50 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారని అన్నారు.
మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మహిళలు, పిల్లలు, శరణార్థుల ఆశ్రయాలను లక్ష్యంగా చేసుకుని వేలా మందిని ఇజ్రాయెల్ చంపేసిందని మండిపడ్డారు. పౌరులకు మానవతా సాయం కూడా అందకుండా ఆటంకాలు కల్పిస్తున్నదన్నారు. ఐక్యరాజ్య సమితితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అమెరికా, దాని మిత్ర దేశాల మద్దతుతోనే ఇజ్రాయెల్ మారణకాండ కొనసాగిస్తున్నదని ఆరోపించారు.
ఇరాన్పైనా యుద్ధాన్ని ప్రకటించి ఇజ్రాయెల్ బీభత్సం సృష్టిస్తున్నదని, అంతర్జాతీయ చట్టం, మానవ హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. ఈ దురహంకార మారణహోమాన్ని వామ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. పాలస్తీనాకు సంఫీుభావంగా ఈనెల 19న కార్యక్రమాలు నిర్వహించాలని అఖిల భారత వామ పక్షాలు పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పాలస్తీనాకు సంఘీభావంగా, ఇజ్రాయెల్ కు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ వేములపల్లి వెంకటరామయ్య, గోవర్ధన్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రమేశ్ రాజా, ఎస్యూసీఐ(సి) మురహరి పాల్గొన్నారు.