
ఖమ్మం టౌన్, వెలుగు : దేశంలో ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్ ప్రజల హక్కులను కాలరాసిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. గురువారం ఖమ్మం సిటీలోని ఓ హోటల్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ చీకటిరోజుగా నిలిచి 50 ఏండ్లు పూర్తయిందని పేర్కొన్నారు. రాజ్యాంగం ఎలా అవహేళనకు గురైందో, హక్కుల అణిచివేత ఎలా జరిగిందో ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని, అందుకు కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని తెలిపారు.
బీసీ ఎజెండా గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు,460 హామీలు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ వాగ్దానాలు ఇస్తుందని విమర్శించారు. తెలంగాణను బాగు చేసే సత్తా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు లేదని, అప్పుల ఊబిలోంచి రాష్ట్రాన్ని బయటకు తేవాలంటే బీజేపీకే సాధ్యమని పేర్కొన్నారు. జర్నలస్టులకు ఇచ్చే ఇండ్ల స్థలాలను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.