బీఆర్ఎస్ హయాంలోనే విద్యారంగం సర్వనాశనం : మేడిపల్లి సత్యం

బీఆర్ఎస్ హయాంలోనే విద్యారంగం సర్వనాశనం : మేడిపల్లి సత్యం
  • ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: మేడిపల్లి సత్యం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనే విద్యారంగం సర్వనాశనమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శుక్రవారం సీఎల్పీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. 8 ఏండ్ల పాటు గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్.. రాష్ట్రంలోని విద్యా రంగాన్ని ఏం ఉద్ధరించాడని ప్రశ్నించారు. 

కేటీఆర్ వెంట తిరుగుతూ ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల అద్దె కూడా చెల్లించనప్పుడు కేసీఆర్‌‌‌‌ను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యా శాఖను నిర్వర్తిస్తున్నారని, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.

 బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీలకు కనీసం వీసీలను కూడా నియమించలేదని, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయం పాటిస్తూ వీసీలను నియమించిన విషయాన్ని ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ మరిచిపోవద్దని కోరారు.