
- సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిశుభ్రత పాటించాలి: మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: కరోనాపై ఆందోళన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై సెక్రటేరియెట్లో సంబంధిత నిపుణులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లను అలర్ట్ చేయాలన్నారు. సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్నారు.
అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్, మెడికల్ రీఏజెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. ఇదే సమయంలో డెంగీ, ప్లేట్లెట్స్ పేరిట ప్రజలను దోచుకునే ప్రైవేటు హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో వాటర్బోర్న్ (డయేరియా, టైఫాయిడ్), వెక్టార్ బోర్న్ (డెంగీ, మలేరియా) జబ్బుల నివారణ, నియంత్రణకు సూచనలు ఇవ్వాలని నిపుణులను మంత్రి కోరారు. వెక్టార్బోర్న్ డిసీజ్ల నియంత్రణ కోసం, ఎప్పటికప్పుడు నీటి సాంపిల్స్ను పరీక్షించి, నివేదికలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీసీఎంబీ, సీడీఎఫ్డీ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించారు.
కరోనాతో ప్రమాదమేమి లేదు..
పరిశోధనల ప్రకారం కరోనాతో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నంబికూరి సహా ఇతర నిపుణులంతా మంత్రికి వివరించారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. విదేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా.. హాస్పిటలైజేషన్ అసలు లేదని తెలిపారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్, ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ సుదీప్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.