
- రూ.32 లక్షల చెక్కు అందజేసిన మంత్రి కొండా సురేఖ
- అర్చక, ఉద్యోగుల కోసంసంక్షేమ నిధి ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: అర్చక, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అన్ని ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శుక్రవారం సెక్రటేరియెట్లో మంత్రి సురేఖ, ఎండో మెంట్ డైరెక్టర్ వెంకటరావు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పనిచేస్తున్న18 మంది ఉద్యోగులకు అర్చక సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా గ్రాట్యుటీ, మెడికల్ సాయానికి సంబంధించిన రూ.32 లక్షల చెక్కును ఆమె అందజేశారు.
ఉద్యోగులకు ఆర్డర్ కాపీలు ఇచ్చారు. ఆ తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులను న్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా ఆలయాల్లో పనిచేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇవ్వనున్నట్లు చెప్పారు. ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించే
గ్రాట్యుటీ నిర్ధారించినట్లు పేర్కొన్నారు.
ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్ మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు, రిపేర్ల నిమిత్త పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని దివ్యాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించిన మంత్రి కొండా సురేఖకు అర్చక, ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటీ పథకానికి అర్చక సంక్షేమ బోర్డు ద్వారా గ్రాట్యుటీ రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచడం హర్షణీయమన్నారు.