కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదు : మంత్రి తుమ్మల

కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదు : మంత్రి తుమ్మల
  • కమిషన్ ముందు కేసీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌, ఈటల పచ్చి అబద్ధాలు: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని కమిషన్ ముందు కేసీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఆ కేబినెట్‌‌‌‌‌‌‌‌లో తాను కూడా మంత్రిగా ఉన్నానని, మంత్రి మండలిలోకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ రిపోర్టు ఏది రాలేదని స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. 

కాళేశ్వరానికి సంబంధించిన వివరాలు అడుగుతూ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ అందిందని, ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటికే పూర్తి వివరాలు ఇచ్చి ఉంటుందని చెప్పారు. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై, ప్రస్తుతం పనులు సాగుతున్న ప్రాజెక్టులపై కూడా సబ్ కమిటీ వేశారన్నారు. ఈ సబ్ కమిటీ కేవలం వాటి పరిస్థితిపై సిఫారసు మాత్రమే చేస్తుందని, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల అంశం కేబినెట్ ముందుకు గాని, సబ్ కమిటీ ముందుకు గాని రాలేదని పేర్కొన్నారు.  

మంత్రులతో ముఖాముఖిలో తుమ్మల..

గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మంత్రులతో ‘ముఖాముఖి’ లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. పలు సమస్యలపై మంత్రికి 50కి పైగా వినతి పత్రాలు అందాయి. వీటిపై మంత్రి అప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు కల్పనపైనే ఎక్కువ వినతి పత్రాలు వచ్చాయి. గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌కు వచ్చే ప్రతి వినతిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నానని, ఇది పేదలకు ఉపయోగపడే మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు.