
ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో రోడ్ల మీద ర్యాంప్ లు కట్టనివ్వవద్దని, రోడ్ల మీద ఆక్రమణలు జరుగుతుంటే అధికారులు నిద్ర పోతున్నారా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, విద్యుత్, మార్కెటింగ్, రెవెన్యూ ఆఫీసర్లతో మంత్రి సమావేశమయ్యారు. నగరంలో జరుగుతున్న పనులపై సమీక్షించారు. రోడ్లు చిన్నగా ఉంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారుల నిర్మాణంలో కొన్ని చోట్ల వంద అడుగుల నుంచి 60 అడుగులకు తగ్గించడంతో అధికారులపై సీరియస్ అయ్యారు. వర్షాలు వచ్చేనాటికి ఇరిగేషన్ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పది రోజుల్లో పూర్తి కావాల న్నారు.
విద్యుత్ శాఖ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్ పదేండ్ల నాటికి పరిస్థితులను దృష్టి పెట్టుకుని విద్యుత్ శాఖ పని చేయాల్సి వుంటుందని చెప్పారు. కొత్తగా విద్యుత్ స్తంభాలు, మొక్కలు నాటే సమయంలో మళ్లీ చెట్లు కొట్టాల్సిన పనిలేకుండా చూసుకోవాలన్నారు.
రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో సమన్వయం చేసుకుని విద్యుత్ శాఖ పని చేయాలని ఆదేశించారు. రోడ్ల విస్తరణకు స్తంభాలు అడ్డులేకుండా చూడాలన్నారు. మరోవైపు ఖమ్మం నగరంలో మరో తహసీల్దార్ ను రప్పించేందుకు నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఇప్పటికే నవీన్ మిట్టల్ తో తాను మాట్లాడానని, నగరంలోని జనాభాకు తగిన విధంగా ఇంకో తహసీల్దార్ అవసరం ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ్రూట్ మార్కెట్ పనుల పరిశీలన
హరిత గార్డెన్స్ ఎదురుగా నిర్మాణంలో ఫ్రూట్ మార్కెట్ ను మంత్రి తుమ్మల పరిశీలించారు. గతంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం నిర్మాణం ప్రారంభించినా, తర్వాత దాన్ని హోల్ సేల్ ఫ్రూట్ మార్కెట్ గా మార్చాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.