దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ జన్మలో ప్రధాన మంత్రి కాలేడని విమర్శించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ని గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. శుక్రవారం కాగజ్నగర్లో నిర్వహించిన బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులనెలా సమకూర్చుకుంటారో బయట పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నిక అవుతారని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400లకు పైగా సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు సైతం మోదీనే ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.