- బల్దియాల్లో వేడెక్కిన రాజకీయాలు
- బలమైన అభ్యర్థుల వేటలో పార్టీలు
మెదక్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అయ్యింది. అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయగానే.. వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఏ వార్డ్ ఎవరికి రిజర్వ్ అవుతుందోనని టెన్షన్ పడుతున్నారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో32 వార్డులు, తూప్రాన్లో 16 వార్డులు, నర్సాపూర్లో 15 వార్డులు, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి.
వార్డుల వారీగా అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలను ఆశావహులు పరిశీలిస్తున్నారు. ఏ వార్డులో ఏ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ ఉన్నారు.. ఆ వార్డు గతంలో ఎవరికి రిజర్వ్ అయ్యింది.. ఈసారి రిజర్వేషన్ ఎలా వచ్చే అవకాశం ఉంది.. ఏ వార్డులు మహిళలకు రిజర్వు కానున్నాయని ప్రధాన పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. సొంత వార్డులో రిజర్వేషన్ అనుకూలంగా రాకుంటే మరో వార్డులో పోటీ చేస్తే ఎలా ఉంటుందని తర్జన భర్జన పడుతున్నారు.
మహిళా రిజర్వు వస్తే భార్యలనో కుటుంబసభ్యులనో పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్న నేతల్లో రిజర్వేషన్ల అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఆయా పార్టీల లీడర్లు అనుకూలమైన వార్డులను ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమ సొంత వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రాకుంటే గెలుపు అవకాశాలు ఉండే మరో వార్డు నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో రాజకీయాలు వేడెక్కాయి.
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కౌన్సిలర్స్థానాలకు అర్హులైన వారి పేర్లతో లిస్ట్ తయారు చేయాలని డీసీసీప్రెసిడెంట్లకు పీసీసీ చీఫ్ సూచించారు. ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అయినా బలమైన అభ్యర్థి బరిలో ఉండాలని, ఈ మేరకు ప్రతి వార్డులో బలమైన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించారు.
