
కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వచ్చిన థగ్లైఫ్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇండియాలో.. ఫస్ట్ వీక్లో రూ.44.75 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. తమిళంలో రూ.38.94 కోట్లు, హిందీలో రూ.1.66 కోట్లు, తెలుగులో రూ.4.15 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సినిమా రిలీజై 9 రోజుల గడిచినప్పటికీ.. రూ.50 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అంటే, థగ్లైఫ్ ఎలాంటి కష్టకాలంలో ఉందో దీన్నీ బట్టే అర్ధం చేసుకోవొచ్చు. అయితే, ఇపుడీ వసూళ్ల ప్రభావం.. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్కు భారీ దెబ్బేసింది. వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.130 కోట్లకు పైగా వెచ్చించి మరి థగ్లైఫ్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుంది. అయితే, నెట్ఫ్లిక్స్ ఇప్పుడు నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చింది. థగ్ లైఫ్ యొక్క పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ ఒప్పందాన్ని నెట్ఫ్లిక్స్ తిరిగి చర్చలు జరుపుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంటే, ముందుగా నెట్ఫ్లిక్స్ తీసుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వారు అసలు ఒప్పందం అయిన రూ.130 కోట్ల నుండి 20-25% తగ్గింపుతో, ముందుగా అంగీకరించిన మొత్తాన్ని సవరించాలని నెట్ఫ్లిక్స్ పరిశీలిస్తోందని సినీ వర్గాల సమాచారం. రూ.130 కోట్లలో కనీసం 25 శాతం మొత్తాన్ని లేదా.. రూ.30 కోట్లను తగ్గిస్తేనే తాము అంగీకరిస్తామని నెట్ఫ్లిక్స్ కరాఖండీగా చెప్పేసిందట.
ఇకపోతే, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్కి.. నెట్ఫ్లిక్స్ రూ.130 కోట్లు, శాటిలైట్ రైట్స్ను విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే, థగ్ లైఫ్ థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా దాదాపు రూ.200 కోట్లు వచ్చాయి. ఇపుడు నెట్ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయంతో కమల్ హాసన్కి భారీ నష్టం జరగనుంది. అయితే, ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ క్రమంలోనే థగ్లైఫ్ త్వరలోనే ఓటీటీలోకి అడుగుపెట్టనుందనే మరో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ వస్తున్నాయి. అందులో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మాత్రం.. మరికొంత ఆలస్యంగా ఓటీటీలోకి దర్శనమిస్తాయి.
కానీ, థగ్లైఫ్ విషయంలో అలా కనిపించటం లేదు. ఆగస్ట్ 15న స్ట్రీమింగ్ అవ్వాల్సిన ఈ సినిమా.. నాలుగు వారాల కంటే ముందే, అది కాదంటే, అంతకంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. జూన్ చివర్లో లేదా.. జులై ఫస్ట్ వీక్లోనే స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ మూవీని కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణి రత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ మరియు ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించాయి.