హెచ్ఎండీఏలో.. కొత్త జోన్లు అయ్యేనా?

హెచ్ఎండీఏలో.. కొత్త జోన్లు అయ్యేనా?
  • సిటీలో పెరిగిపోతున్న  లే అవుట్లు, బిల్డింగ్​పర్మిషన్ల దరఖాస్తులు 
  • కొత్తగా మరో రెండు జోన్ల ఏర్పాటుకు నిర్ణయించినా పెండింగే..  
  • కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా విభజన చేయాలంటున్నా అధికారులు

హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్​మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్​అథారిటీ(హెచ్ఎండీఏ)గా ఏర్పాటైన తర్వాత సిటీ విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగా హెచ్ఎండీఏలో జోన్లను కూడా విస్తరించాలనే ప్రతిపాదనలు ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. హైదరాబాద్​అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ(హుడా)ను హెచ్ఎండీఏగా మార్పు చేశారు. ఏడు జిల్లాల పరిధిలో 7,300 చ. అడుగుల మేరకు హెచ్ఎండీఏ విస్తరించింది. కానీ.. అందుకు అనుగుణంగా సేవలు కూడా విభజించాలని గత ప్రభుత్వంలో నిర్ణయించారు.  కేవలం ప్రతిపాదన దశలోనే నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్లానింగ్​విభాగంలో పెరిగిన పనిభారాన్ని తగ్గించేందుకు అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అధికారులు అంటున్నారు. సువిశాల పరిధిలోనిహెచ్​ఎండీఏ లో ప్రస్తుతం నాలుగు జోన్లు ఉన్నాయి. 

ప్రస్తుతం నాలుగు ఉండగా..

ఘట్​కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్​పల్లి జోన్లు ఉన్నాయి. వీటి ద్వారానే ఇప్పటివరకు హెచ్ఎండీఏ ప్లానింగ్​విభాగం వివిధ ప్రాజెక్టులు, వివిధ రకాల అనుమతులను ఇస్తోంది. ఇప్పడున్న జోన్లు కాకుండా కొత్తగా మరో రెండు, నాలుగు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు గత ప్రభుత్వంలోనే చేశారు. అయితే ఏయే ప్రాంతాలను కలిపి కొత్తజోన్లు ఏర్పాటు చేయాలనే దానిపై అవసరమైర కసరత్తు చేయాలని కూడా అప్పట్లో హెచ్ఎండీఏ అధికారులను మున్సిపల్​శాఖ ఆదేశించింది. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి కసరత్తు జరగలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొత్త జోన్లు ఏర్పడితే ఇప్పుడున్న అధికారులపై పనిభారం తగ్గతుంది. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యాన్ని కూడా నివారించడానికి అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. 

ప్లానింగ్​విభాగమే ప్రధాన ఆదాయ వనరు 

హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరు ప్లానింగ్​విభాగమే. దీన్ని వికేంద్రీకరించడం ద్వారా మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్లానింగ్​విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు భూ సమీకరణ కూడా ఈజీ అవుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్ల పరిధిలో కొత్త లేఅవుట్​లు, బిల్డింగ్​పర్మిషన్లు తదితర పనిలన్నీ కూడా హెడ్డాఫీసు పరిశీలన చేసిన తర్వాతనే జోనల్​ప్లానింగ్​అధికారులు ఫీల్డ్​విజిట్​చేసి రిపోర్టు ఇచ్చాక పర్మిషన్లు ఇస్తున్నారు. ప్రస్తుతం నాలుగు జోన్ల పరిధిలో పెద్దసంఖ్యలో లే అవుట్ల విస్తీర్ణం, భవన నిర్మాణస్థాయి కూడా పెరుగుందంటున్నారు.  దీంతో వీటి అనుమతులను ప్లానింగ్​డైరెక్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది. కొత్త జోన్లు ఏర్పడితే జోనల్​స్థాయిలోనే ప్లానింగ్ అధికారులు ఫీల్డ్​విజిట్​చేసి అప్పటికప్పడు అనుమతి ఇవ్వడానికి చాన్స్ ఉంటుందని అంటున్నారు.

జోనల్ ఆఫీసులను విస్తరిస్తే..

ప్రస్తుత విధానంలో జోనల్​అధికారులు ఫీల్డ్​విజిట్​చేసి ఇచ్చే రిపోర్టులను బట్టి డైరెక్టర్లు అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఒక్కో పర్మిషన్ కు రోజుల తరబడి సమయం పడుతుందంటున్నారు. జోనల్​ఆఫీసులను విస్తరిస్తే కొన్ని ప్రత్యేక దరఖాస్తులు మాత్రమే డైరెక్టర్లకు చేరుతాయంటున్నారు. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా బిల్డింగ్, లే అవుట్​పర్మిషన్లు మరింత ఈజీ అవుతుందంటున్నారు. ప్రస్తుతం అమలులోని జీవోల ప్రకారం 30 నుంచి 40 అడుగుల రోడ్డును పరిగణలోకి తీసుకుని లే అవుట్, బిల్డింగ్​పర్మిషన్లు నిలిపివేశారు. కనీసం100 అడుగుల రోడ్డు ఉన్న వాటికే పర్మిషన్లు ఇస్తున్నారు. జోనల్ ఆఫీసులను విస్తరిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయంటున్నారు. 30 నుంచి 40 అడుగుల రోడ్ల నిర్మాణాలను జోనల్​స్థాయిలోనే  అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. గత ప్రభుత్వం పెండింగ్​లో పెట్టిన జోన్లు విస్తరణ కాంగ్రెస్​ ప్రభుత్వంలోనైనా అమలులోకి వస్తుందన్న ఆశాభావంతో అధికారులు ఉన్నారు.