పిల్లలను చంపేస్తామంటూ చిన్మయి ఫ్యామిలీకి బెదిరింపులు.. సోషల్ మీడియాకు రాహుల్ రవీంద్రన్ గుడ్ బై!

పిల్లలను చంపేస్తామంటూ చిన్మయి ఫ్యామిలీకి బెదిరింపులు.. సోషల్ మీడియాకు రాహుల్ రవీంద్రన్ గుడ్ బై!

 సోషల్ మీడియాలో రోజురోజుకూ సెలబ్రిటీలకు వేధింపులు తీవ్రమవుతున్నాయి. లేటెస్ట్ గా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కుటుంబం సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగారు కొందరు ప్రబుద్ధులు. దీంతో  రాహుల్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఎక్స్ ఖాతాను శాశ్వతంగా విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సినీవర్గాలతో పాటు నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది.

వివాదం ఎక్కడ మొదలైంది?

ఈ వివాదానికి కారణం కేతన్ అగర్వాల్‌కు సంబంధించిన హత్య కేసు చుట్టూ సోషల్ మీడియాలో సాగిన చర్చ. ఇటీవల 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాను తెరకెక్కించిన రాహుల్‌ను ఉద్దేశించి, ఓ నెటిజన్ కేతన్ అగర్వాల్ కేసును ప్రస్తావిస్తూ.. మగాళ్లపై జరిగే అన్యాయాలపై ఎప్పుడు సినిమా తీస్తారు? అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ ఇచ్చిన సమాధానం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత కొందరు హద్దులు మీరి ఆయనపై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దాడులకు దిగారు.  అసభ్య సందేశాలు, మరణ బెదిరింపులు పంపడం ప్రారంభించారు.

►ALSO READ | సీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్-భాగ్యశ్రీ బోర్సే రొమాన్స్.. థ్రిల్ రేపుతోన్న 'లెనిన్' ట్రైలర్!

ఆ రాత్రి ఏం జరిగిందంటే?

బ్రెజిల్ వర్సెస్ జపాన్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ అప్రయత్నంగా ఫోన్ చూశానని, ఆ నోటిఫికేషన్లు చూశాక తన గుండె పగిలిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నా పిల్లలను చంపేస్తామంటూ వచ్చిన మెసేజ్‌లు చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాను. ఆ వ్యక్తిని వెతికి పట్టుకుని ఏదో ఒకటి చేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, నాలోని ఆ రాక్షస కోపం నన్నే భయపెట్టింది అని ఆయన పేర్కొన్నారు. బహుశా నేను అతిగా స్పందిస్తున్నానేమో, నా పిల్లలు, నేను ఈ ద్వేషానికి అర్హులమేమో అంటూ తీవ్ర ఆవేదనతో కూడిన చివరి పోస్ట్ పెట్టి రాహుల్ ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పారు.

 

తోడుగా నిలిచిన భార్య చిన్మయి

ఇక రాహుల్ నిర్ణయానికి ఆయన భార్య, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పూర్తి మద్దతు తెలిపారు. వివాహ బంధం, పరస్పర గౌరవం, అనుభూతి గురించి రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె మళ్లీ పంచుకుంటూ ఆయనకు అండగా నిలిచారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే వారిపై పెరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత దాడులు, కుటుంబాలను లక్ష్యంగా చేసుకునే సంస్కృతి మరోసారి చర్చనీయాంశంగా మారింది..