టూవీలర్లకు ఏబీఎస్ బ్రేక్స్.. త్వరలో పెరగనున్న బైక్స్ ధరలు: నోమురా

టూవీలర్లకు ఏబీఎస్ బ్రేక్స్.. త్వరలో పెరగనున్న బైక్స్ ధరలు: నోమురా

భారతదేశం రోడ్లపై ఎక్కువగా కనిపించేవి టూవీలర్లే. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశంలో ప్రధాన రవాణా సాధనంగా చాలా మంది బైక్స్, స్కూటర్లను వినియోగిస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదాల సమయంలో కూడా చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే వీటిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనలతో ముందుకొచ్చింది. 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో తయారవుతున్న అన్ని టూవీలర్లకు ఏబీఎస్ బ్రేక్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్థేశించింది. దీంతో 125 సీసీ కంటే తక్కువ మోడల్ బైక్స్ కూడా మరింత రక్షణను పొందనున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జనవరి 2026 నుంచి దేశంలో అమలులోకి రాబోతోంది. ఈ నిర్ణయం వల్ల రానున్న రోజుల్లో బైక్ ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరుగుతాయని నోమురా ఇండియా ఆటో రీసెర్చ్ అనలిస్ట్ కపిల్ సింగ్ వెల్లడించారు.

తక్కువ సీసీ బైక్స్ కి కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేయటంతో సింగిల్ చానల్ ఏబీఎస్ కోసం వాహనదారులు అదనంగా రూ.3వేల వరకు పెరిగిన ఖర్చులను చూస్తారని అన్నారు. అయితే మోడళ్ల ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయని నోమురా భావిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్ముడవుతున్న టూవీలర్లలో 85 శాతం 125సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగినవే కావటంతో చాలా మంది పెరిగిన ధరలను భరించాల్సి ఉంటుంది. భారత మార్కెట్లలో కస్టమర్లు ప్రైస్ సెన్సిటివ్ కావటంతో కంపెనీలు సైతం దీని ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది.