ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ప్రపంచ ఎలక్ట్రానిక్ వెహికల్ డేకు ఒక రోజు ముందే ఓలా శుభవార్త ప్రకటించింది. ఈనెల 8వ తేదీ నుంచి ఆన్లైన్లో ఓలా ఎలక్ట్రిక్ బైకులు అమ్ముతున్నట్లు ఓలా వెల్లడించింది. అది కూడా స్టాక్ ఉన్నంత వరకే అని ప్రకటించింది. తొలి విడుతగా రెండు వేరియంట్లను రిలీజ్ చేస్తోంది ఓలా. పది రంగుల్లో ఓలా ఎస్1 బైకు ఎక్స్ – షోరూమ్ ధర రూ.99,999, అలాగే ఓలా ఎస్1 ప్రొ బైకు ధర రూ,1,29,999 గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ ధరలో సబ్సిడీ లేదని.. అయితే బైకు కొనుగోలు చేసిన తరవాత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని వినియోగదారులు క్లయిమ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈఎంఐ కోసం రూ.20వేలు అడ్వాన్స్
ఓలా ఎలక్ట్రిక్ బైకులు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకునే వారు రూ.20 వేలు అడ్వాన్స్ గా చెల్లించాల్సి ఉంటుందని, ఒక వేళ బుకింగ్ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని కంపెనీ ప్రకటించింది. ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు ఉంటాయని, మొత్తం ఆన్లైన్లోనే కొనుగోలు ప్రక్రియ సాగుతుందని కంపెనీ వివరించింది. వచ్చే నెలలో టెస్ట్ రైడ్స్ అందుబాటులోకి తెస్తామని ఓలా చెబుతోంది.