
- పీసీసీ అబ్జర్వర్లు పంపిన నివేదిక ఆధారంగా ఎంపిక
- ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ప్రాధాన్యం
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే ప్రచారం సాగుతుండడంతో పీసీసీ నాయకత్వం వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామకంపై కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించడంతో ఇక డీసీసీ అధ్యక్షుల నియామకం మరింత త్వరగా చేపట్టాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ను ఆదేశించారు. అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తేనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఉత్సాహంతో పనిచేస్తారని, ఇది పార్టీ గెలుపునకు దోహదపడుతుందని హైకమాండ్ భావిస్తోంది.
ప్రతి జిల్లా నుంచి ముగ్గురు లేదా ఐదుగురి పేర్లు
పీసీసీ అబ్జర్వర్లు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పర్యటించి డీసీసీ చీఫ్ పదవులకు ఎవరైతే బాగుంటుందని ఓ నివేదికను సిద్ధం చేశారు. ప్రతి జిల్లాల్లో ఆ పదవి కోసం మూడు నుంచి ఐదు పేర్లను పీసీసీకి పంపించనున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వంటి సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరి పేరును పరిగణనలోకి తీసుకొని పీసీసీకి పంపిస్తే, అందులో ఆ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఏదో ఒక సామాజికవర్గం నేతకు ఆ పదవి ఇవ్వనున్నారు. ఈ పదవికి నియమించే వ్యక్తి 2017 నుంచి పార్టీలో కొనసాగడం, పార్టీ సిద్ధాంతాల పట్ల విధేయతతో ఉండడం, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికే ప్రాధాన్యత దక్కనుంది.
అయితే, ఏఐసీసీ తరఫున కూడా అబ్జర్వర్లు రాష్ట్రానికి రానున్నారని, వారు కూడా జిల్లాల వారీగా ఇచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకొని జిల్లా అధ్యక్షుల నియామకాన్ని ఫైనల్ చేయనున్నట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు కొంత ముందే డీసీసీలను నియమిస్తే వారు కూడా జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని, అందుకే సాధ్యమైనంత త్వరగా వీటిని నియమించడంపై మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్టు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆ వెంటనే మండల కమిటీలను కూడా నియమిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు.