
తెలంగాణలో వెలుగు చూస్తున్న ‘ఫోన్ ట్యాపింగ్’ కేవలం ఒక నేరం కాదు. తేనె తుట్టెను కదిల్చినట్టు, చీమల పుట్టను తవ్వినట్టు, కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ స్పష్టమవుతున్నదేమంటే... ఇదొక నేరాల పరంపర! గొలుసుకట్టు నేరాల ఘోరం, ప్రజాస్వామ్య విధ్వంసం.
అధికార దుర్వినియోగం ద్వారా చట్టాలను ఉల్లంఘిస్తూ పాలకులు చేసిన అరాచకం. పెద్ద సంఖ్యలో జనాల వ్యక్తిగత గోప్యతకు విఘాతమే కాకుండా, తద్వారా.. బ్లాక్ మెయిల్, బెదిరింపు, వసూళ్లు, దోపిడీ, లొంగదీసుకోవడం, లైంగిక వేధింపులు-హింస, మోసం, రికార్డుల తారుమారు.. ఇలా లెక్కకు మించిన నేరాల పుట్ట! సమస్త పాలనా వ్యవస్థను చెరబట్టి ‘మా ఇష్టం, మాకు ఎదురే లేదు’ అని విచ్చలవిడిగా జరిపిన దుర్మార్గానికి పరాకాష్ట!
సిట్ దర్యాప్తుతో అన్ని నేరాలూ న్యాయస్థానంలో రుజువై బాధ్యులకు శిక్షలు పడతాయా? సందేహమే! బీజేపీ కోరుతున్నట్టు సీబీఐ దర్యాప్తుతో న్యాయం జరుగుతుందా? అదీ అనుమానమే! ఎందుకంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్న తీరు అలా ఉంది. మరేంటి మార్గం? సిట్టింగ్ జడ్జీ తో న్యాయవిచారణే..
ప్రభుత్వంలో అవినీతి, అరాచకాలకు పాలన నేతృత్వం వహించేవారు ఎంతగా బాధ్యులవుతారు? ఈ అంశాలే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తరచూ చర్చకు వస్తున్నాయి. యాబై ఏళ్ల కిందటి ఓ పరిణామం ఆ తేడాని ఇట్టే పట్టిస్తుంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్న రోజులవి. సోషలిస్ట్ నాయకుడు జయప్రకాశ్నారాయణ సన్నిహితులు కుమార్ ప్రశాంత్, జానకి ఒకరోజు 20-–30 ఉత్తరాలున్న కట్ట ఒకటి తెచ్చిచ్చారు. ‘కదమ్ కువా’ నివాసం శుభ్రపరుస్తుంటే దొరికిన ఆ పాత ఉత్తరాలు, జవహర్లాల్ నెహ్రూ సతీమణి కమల, జేపీ భార్య ప్రభావతికి రాసినవి. ‘మంచిదయింది, ఇవి దొరికాయి’ అన్నారు జేపి.
అమెరికాలో ఏడేళ్ల విద్యాభ్యాసం ముగించి, మార్క్సిస్ట్ భావజాలంతో భారత్ వచ్చిన జేపీ వెంటనే స్వాతంత్ర్యోద్యమంలోకి దూకిన తొలినాళ్లలో (1929-–30) వారు ‘ఆనంద్ భవన్’లో ఉండేవారు. అప్పుడు కమలా నెహ్రూకి ప్రభావతితో సాన్నిహిత్యం పెరిగి, ఆంతరంగిక విషయాలు మనసు విప్పి పంచుకునే క్రమంలో రాసుకున్నవవి. ఒకటి రెండు ఉత్తరాలు చదివి వినిపిస్తుంటే, అందులోని భావాలు గ్రహించిన జేపీ, మిగతావి చదవటం వద్దన్నారు.
‘ఇవి తగని వ్యక్తుల చేతిలో పడటం నాకిష్టం లేదు, వీటిని ఇందిరకే ఇద్దాం’ అన్నారు. వాటి భద్రత దృష్ట్యా గ్రంథాలయానికి ఇద్దామని, ఆమెకే ఇచ్చేటట్టయితే కాపీ చేసుకొని ఇద్దామని మిత్రులు చేసిన సూచనను జేపీ తిరస్కరించారు. ‘వద్దు, వాటిని ఆమే భద్రపరుస్తారు, మనం ఆమెను నమ్మాలి’ అన్నారు.
‘ఈ పరిస్థితుల్లో ఇందులోని అంశాల ఆధారంగా గిట్టనివారు చేసే వ్యక్తిగత దూషణలు, విమర్శల దాడికి తావివ్వకూడదని నేననుకుంటున్నాను’ని స్పష్టం చేసి, నేరుగా ఇందిర నివాసానికి వెళ్లి ఉత్తరాల కట్ట అప్పగించారు. కృతజ్ఞతలు తెలిపి, దాన్నొక ప్రాధాన్యతాంశంగా పరిగణించని ఇందిర ‘మీరు నాకో సాయం చేయాలి’ అన్నారు. తనపై విమర్శల జోరు తగ్గించాలని కోరారు.
‘నాది అవినీతి వ్యతిరేక పోరాటం’ అని జేపీ బదులిచ్చారు. ‘అంటే, నేను అవినీతిపరురాలనంటారా?’ అన్నారామె.‘పాలనకు నేతృత్వం వహిస్తున్నవారు బాధ్యత తీసుకోవాలి’ అన్నారు జేపీ. (పేజీ 42, 43 ‘ప్రధానమంత్రులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు’- నీరజా చౌదరి) మరి, రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీవారు, కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తులు, జడ్జీలు, జర్నలిస్టులు, అధికారులు, సినీ సెలబ్రిటీలు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలు.. ఇలా నాలుగువేల మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేశారని అభియోగం. ఇన్ని సంభాషణలు విని, అధికారాన్ని అడ్డంగా వాడుకున్న అరాచక ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు బాధ్యులు కారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
సూపర్బాస్ ద్వారా?
‘కాల్ డిటేయిల్ రిపోర్ట్’ (సీడీఆర్) ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేస్తున్న నోటీసులు చూస్తుంటే, ఇంకెంత మంది ఫోన్లు ట్యాప్ చేశారో? అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే దాదాపు 4000 మందికి పైగా ‘ట్యాపింగ్’ ప్రభావితులున్నట్టు తెలుస్తోంది. విభిన్న రంగాల వారికి నోటీసులిచ్చి, వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్కు ఎప్పటికప్పుడు అనుమతులు తీసుకునే క్రమంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని ‘రివ్యూ’ కమిటీని కూడా నిర్వాహకులు బురిడీ కొట్టించారు. పైన ఒకటి, రెండు పేజీల్లో మావోయిస్ట్ తీవ్రవాద సంస్థల వారి పేర్లు పెట్టి, అనుబంధ పేజీల్లో తాము లక్ష్యం చేసుకున్న వారి పేర్ల పేజీలు ఉండేలా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) టాస్క్ టీమ్ వ్యవహరించిందని దర్యాప్తు వెల్లడిస్తోంది.
‘సూపర్ బాస్’ ద్వారా ఎస్ఐబి హెడ్ కి, అక్కడ్నుంచి టాస్క్ ఆపరేషన్స్ చూసే అధికారికి ఆదేశాలు వచ్చేలా ఒక ‘సులభ మార్గం’ ఏర్పాటు చేసుకున్నట్టు స్పష్టమౌతోంది. ఇక మిగిలిందంతా విచ్ఛలవిడితనమే! ఈ క్రమంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీవోటీ) వారిని కూడా బోల్తా కొట్టించారు.
గోప్యత హక్కుకు గోరీ
పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఉన్నత ధర్మాసనం 2018లోనే స్పష్టం చేసింది. తమ వ్యక్తిగత సంభాషణలు గోప్యంగా ఉండాలని కోరుకునే పౌరుల హక్కుకు రాజ్యాంగంలోని 21వ అదికరణం (జీవించే హక్కు) భద్రత కల్పిస్తుంది.
గోప్యత పౌరుల కాదనలేని హక్కే అయినా, దేశ భద్రత, సౌర్వభౌమాధికారం, దౌత్యరక్షణ తదితర ప్రత్యేక సందర్భాల్లో అనుమానితుల టెలిఫోన్ సంభాషణల్ని సాంకేతిక జోక్యం ద్వారా నిఘా, దర్యాప్తు సంస్థలు వినవచ్చని చట్ట (ఇండియన్ టిలిగ్రాఫ్ యాక్ట్ 1885) నిబంధనలకు కొన్ని మినహాయింపులున్నాయి.
ప్రత్యేక పరిస్థితులు, సహేతుకమైన కారణాలు చూపడం తప్పనిసరి. వినతి, అనుమతితో సహా వాటన్నింటినీ రాతపూర్వకంగా నిర్వహించాలి. ఏ ఒక్క నంబర్ విషయంలో, ఏ ఒక్క సందర్భం తీసుకున్నా చట్ట నిబంధనలకు ట్యాపింగ్ ప్రక్రియ విరుద్దంగా ఉండకూడదు. కానీ, వేల కేసుల్లో చేసిందంతా అక్రమం, అన్యాయం, చట్ట విరుద్దమని తెలుస్తోంది.
దర్యాప్తులు– అనుమానాలు
దర్యాప్తు సమగ్రంగా జరిగి, నేరాల పరంపర నిర్దారణ అయి, బాధ్యులయిన వారంతా శిక్షకు గురవుతారా? అన్న సందేహాలు పరస్పర రాజకీయ విమర్శల వల్ల తలెత్తుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ మెతకగా ఉందని బీజేపీ ఆరోపిస్తే, బీజేపీయే బీఆర్ఎస్ తో లోపాయికారి అవగాహనతో నడుస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
‘సిట్’ దర్యాప్తుపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసినట్టే, వారు కోరుతున్న సీబీఐ దర్యాప్తు మీద కాంగ్రెస్ కూ సందేహాలున్నాయి. కేంద్రం తనకు తానుగా సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో... రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలనే అభిప్రాయం జనక్షేత్రంలో ఉంది.
ట్యాపింగ్ ఇప్పుడు లేదని చెప్పగలరా? ఇంత జరుగుతుంటే, ట్యాపింగ్ కేసు చుట్టూనే ఇన్ని కుట్రలు, పన్నాగాలు, దురాగతాలు, దౌర్జన్యాలు బయటకు వస్తుంటే, ప్రస్తుత ప్రభుత్వం ‘ట్యాపింగ్ చేయకుండా ఉందా?’ అనే ప్రశ్న ఉదయించడం సహజం! నాయకులు ఫోన్ కాల్స్కు భయపడుతున్నారు. వాట్స్ప్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
జనతా స్కరార్పైనా ఆరోపణొచ్చింది!
ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వ హయాంలో ఇందిరా గాంధీ కోడలు మేనక జయప్రకాశ్ నారాయణను కలిశారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, టెలిఫోన్లు ట్యాప్ చేసి సంభాషణలు వింటోందని ఫిర్యాదు చేశారు. ‘అవునా?’ అని జేపీ ఆరా తీయడాన్ని గమనించిన ఆయన అనుచరులు, మేనక వెళ్లిపోయిన తర్వాత జేపీని అడిగారు.
‘మరి ఇందిర హయాంలో కూడా విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు కదా?’ అంటే, ‘ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది కదా!’ అని జేపీ ఎదురు ప్రశ్నించారు. స్వయంగా ప్రకటించుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటివి జరగకూడదు. దట్సాల్!!
తెలిసి చేసిన నేరాల జాతర
తీగ లాగితే డొంక కదిలినట్టు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెల్లడవుతున్న విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా, లోతైన కుట్రతో చేసిన అక్రమ ట్యాపింగ్ నేరానికి తోడు, దొంగచాటుగా విన్న సంభాషణల్ని వాడుకొని ఎన్నో తదనంతర నేరాలకు పాల్పడ్డారు.
ఇందులో కొన్ని పనిగట్టుకొని చేసినవైతే మరికొన్ని ట్యాపింగ్ క్రమంలో యాదృచ్ఛికంగా తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని అడ్డంగా వాడుకొని, అవతలి వ్యక్తుల్ని బెదిరించి చేసిన చర్యలు మరెన్నో నేరాలకు దారితీశాయి. నేరాలను ఒక జాతరలా జరిపించారు.
2018 ఎన్నికలకు ముందు నుంచే ఈ పర్వం మొదలైంది. ఎన్నికల్లో ప్రత్యర్థుల అవకాశాలను దెబ్బతీసి, తాము అనుచిత ప్రయోజనాలు పొందడానికి ఈ మార్గాన్ని వాడుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోని వారిని బెదిరించి ఆస్తుల్ని రాయించుకున్నారు. సినీతారల విషయంలో లైంగిక వేధింపులకు, బలవంతపు అంగీకారాలకు, లైంగిక హింసకు కూడా పాల్పడ్డట్టు అభియోగాలు వచ్చాయి. వాటిని దృవీకరించేలా దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాలుంటున్నాయి.
-దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-