
- 2022లో ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఆడియోలు రిలీజ్ చేసిన కేసీఆర్
- పెన్డ్రైవ్ల ద్వారా సర్వర్లను గుర్తించేందుకు చర్యలు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డులను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. కేసీఆర్ ప్రెస్మీట్కు ముందు.. ఆ తరువాత ప్రగతిభవన్ నుంచి రిలీజ్ చేసిన ఆడియో రికార్డులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఈ మేరకు కేసీఆర్ ప్రెస్మీట్లో విడుదల చేసిన పెన్డ్రైవ్లను సేకరిస్తున్నారు. పెన్ డ్రైవ్ డేటా ఆధారంగా ఆయా ఆడియోలను గుర్తించనున్నారు. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్డ్రైవ్లోకి వచ్చాయనే వివరాలు సేకరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2022 అక్టోబర్ 26న మొయినాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ కేంద్రంగా జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్అధికారులు దృష్టి సారించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిని కోనుగోలు చేసేందుకు ప్రలోభపెట్టారన్న ఈ కేసులో ఎమ్మెల్యేలతో జరిగిన బేరసారాలకు సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు 2022 నవంబర్ 3న కేసీఆర్ చేతుల మీదుగా ప్రెస్కు అందించిన పెన్ డ్రైవ్లను సేకరిస్తున్నారు.