
- దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష
- పాజిటివిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నిరంతర నిఘా
- అవసరమైతే ఇంటింటికీ పరీక్షలు జరిపించండి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కంటికి కనిపించని మహమ్మారి కరోనాపై చేస్తున్న యుద్ధంలో అన్ని విభాగాల వారు నిరంతరం నిఘాతో అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్పై శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కరోన పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, టీకా రోడ్మ్యాప్ పై ప్రధాని మోడీకి వివరించారు అధికారులు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల టెస్టులు చేసేవారమని.. ఇప్పుడు వారానికి 1.3 కోట్ల టెస్టుల వరకు పెరిగాయని ప్రధానికి అధికారులు వివరించారు. క్రమంగా తగ్గుతున్న టెస్ట్ పాజిటివిటీ రేటు, పెరుగుతున్న రికవరీ రేటు అంశాలను ప్రధానికి వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. అధిక టెస్ట్ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో టెస్టులను మరింత పెంచాలని ప్రధాని మోడీ ఆదేశించారు. ఇంటింటికీ పరీక్షలు, నిఘాపై దృష్టి పెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాపై దృష్టిసారించాలని ఆదేశాలిచ్చారు. వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాల ఉపయోగించడంలో ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీ ఆదేశించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పెంచేందుకు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారులకు ఆదేశాలిచ్చారు.