మాయమాటలు చెప్పి.. బాలికపై అత్యాచారం

మాయమాటలు చెప్పి..  బాలికపై అత్యాచారం
  • గర్భవతిగా తేలడంతో బాధితురాలు సూసైడ్ ..
  • ఆరేండ్ల తర్వాత వ్యక్తికి జీవితఖైదు

ఎల్బీనగర్, వెలుగు: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, పలుమార్లు అత్యాచారం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఎల్బీనగర్ స్పెషల్ పోక్సో కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసులు, పీపీ తెలిపిన ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వెంకటాద్రి పాలెంకు చెందిన శివరాత్రి మల్లేశ్(40) మీర్ పేట పరిధిలోని అల్మాస్ గూడలో నివాసం ఉంటూ డైలీ లేబర్ గా పనిచేస్తున్నాడు. 

2019లో స్థానికంగా ఉండే ఓ బాలికకు మాయమాటలు చెప్పి, శారీరకంగా లొంగతీసుకున్నాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి అయిన తర్వాత ఆమె ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక ఆత్మహత్యకు పాల్పడింది. 

మల్లేశ్ పై అనుమానం వ్యక్తం చేస్తూ మీర్ పేట పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి ఆధారాలతో ఎల్బీనగర్ లోని స్పెషల్ పోక్సో కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన కోర్టు మల్లేశ్​ను నేరస్తుడిగా తేల్చి, సోమవారం జీవిత ఖైదు విధించింది. బాధితురాలి తండ్రికి రూ.2 లక్షల పరిహారం ప్రభుత్వం అందించాలని ఆదేశించింది.