
హైదరాబాద్: యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చంద్ర నాయక్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం (జూన్ 28) రాత్రి 11 గంటల సమయంలో అడ్వకేట్తో కలిసి పూర్ణ చందర్ నాయక్ చిక్కడపల్లి పీఎస్లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆదివారం (జూన్ 29) కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడు పూర్ణ చంద్ర నాయక్ను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా, యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శుక్రవారం (జూన్ 27) రాత్రి జవహర్ నగర్లోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వేచ్ఛ మరణానికి ఆమెతో సహజీవనం చేస్తోన్న పూర్ణ చంద్ర నాయకే కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు పూర్ణ చంద్ర నాయక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే స్టేషన్లో లొంగిపోయిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.