
పెంపుపై జీవో తెచ్చాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్,వెలుగు: ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన కాచిగూడలో మంగళవారం ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు~ దేశవ్యాప్త కులగణన’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు జరపాలన్నారు.
ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లును, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిందని గుర్తుచేశారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన పరిధిలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు కోసం బీసీలతో కూడిన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలన్నారు.
ఈ బిల్లులను రాజ్యాంగంలో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం నేతలు నీలం వెంకటేశ్, చెరుకు మణికంఠ, కోల జనార్ధన్, సి.రాజేందర్, జి.అనంతయ్య, సుప్రజ, శారధ గౌడ్, అంజి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.