
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే మొదటి వారంలో రాష్ట్రానికి వస్తారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన ముఖ్యనేతల భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ రెండ్రోజుల సమయాన్ని తెలంగాణకు కేటాయించారన్నారు. మొదటి రోజు వరంగల్ సభలో పాల్గొంటారని, రెండో రోజు హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతారని తెలిపారు. రాహుల్ టూర్ తేదీలను శనివారం ఏఐసీసీ ఖరారు చేస్తుందని చెప్పారు. రాహుల్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎవరెవరితో భేటీ కావాలనే అంశాన్ని మీటింగ్లో చర్చించామన్నారు. ఇటీవల చేపట్టిన మెంబర్షిప్ డ్రైవ్పైనా చర్చ జరిగిందని తెలిపారు. తెలంగాణలో 40 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని, ఈ రోజుతో మెంబర్షిప్ డ్రైవ్ ముగిసిందన్నారు. సభ్యత్వాలు కట్టిన వారికి ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లించామని మహేశ్గౌడ్ తెలిపారు. శనివారం సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో మీటింగ్ ఉంటుందన్నారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పార్టీ నేతలు బోసురాజు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.