
- ప్రభుత్వానికి డీలర్ల సంఘం వినతి
హైదరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయా లని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం రేషన్ డీలర్ల సంఘం నేతలు సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కలిసి తమ సమస్యను విన్నవించారు. రాష్ట్రం లోని 17,200 మంది రేషన్ డీలర్లు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారని తెలిపారు.
ఏప్రిల్ నుంచి ఆరు నెలల సెంట్రల్ పూల్ కమీషన్, సెప్టెంబర్ నెల నుంచి స్టేట్ పూల్ కమిషన్, రెండేండ్లుగా గన్నీ సంచుల డబ్బులు పెండింగ్లో ఉండటంతో అప్పుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దసరా, దీపావళి పండుగల వేళ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, పెండింగ్లో ఉన్న మొత్తం కమీషన్ తక్షణమే విడుదల చేయాలని కోరారు.