
- రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నది
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తున్నదని, మహిళలతో ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి ఇంటిపైకి అర్ధరాత్రి పోలీసులు వెళ్తే, ఎఫ్ఐఆర్ ఉండదా అని ప్రశ్నించారు. నిందితుడిని మంత్రి కారులో తీసుకెళ్తుంటే కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
సీఎం స్వయంగా గన్ ఇచ్చారని మంత్రి కూతురు ఆరోపిస్తే.. పోలీసులు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో సబిత మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘మిస్ వరల్డ్ పోటీల్లో మహిళకు అన్యాయం జరిగితే దానిపై క్లారిటీ లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టారు. నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను సీఎం అవమానించారు. తాజాగా మాగంటి సునీతపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అని సబితవ్యాఖ్యానించారు.