దంతెవాడ: జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి షార్ట్స్ కట్స్ లేవని టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. కష్టపడటం, క్రమశిక్షణతో ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నాడు. ‘మన లక్ష్యాన్ని చేరుకోవడానికి సత్వరమార్గం లేదు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఏకాగ్రత చాలా కీలకం. భవిష్యత్ చాంపియన్లుగా తీర్చిదిద్దడానికి పటిష్టమైన ప్రాథమిక సౌకర్యాలు చాలా అవసరం. ఎక్కువ క్రీడల్లో పాల్గొనడం వ్యూహాత్మక ఆలోచనను, మానసిక బలాన్ని పెంపొందించడంలో సాయపడుతుంది. మట్టిలో దాగి ఉన్న వజ్రాలను గుర్తించడంలో కోచ్లు కీలక పాత్ర పోషిస్తారు. కానీ భవిష్యత్ను తీర్చిదిద్దుకునే బాధ్యత, అంకితభావం, పట్టుదల పిల్లలపైనే ఆధారపడి ఉంటుంది’ అని సచిన్ పేర్కొన్నాడు.
తన చిన్ననాటి ప్రయాణం గ్రౌండ్లోనే మొదలైందన్న సచిన్ దంతెవాడలో ఇప్పుడు నిర్మిస్తున్న మైదానాలు అద్భుతంగా ఉన్నాయన్నాడు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న దంతెవాడ జిల్లా ఇప్పుడు క్రీడా హబ్గా మారింది. జిల్లా యంత్రాంగం ‘మైదాన్ కప్’ పేరుతో నిర్మించిన 50 క్రీడా మైదానాలను బుధవారం సచిన్ టెండూల్కర్ ప్రారంభించాడు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, మాన్ దేశీ ఫాండేషన్ వీటిని అభివృద్ధి చేస్తోంది. స్థానిక చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు చేపట్టిన పలు కార్యక్రమాల్లో మాస్టర్ పాల్గొన్నాడు. చిందనార్ గ్రామంలోని స్వామి ఆత్మానంద్ హిందీ మీడియం హైస్కూల్లో నిర్మించిన మల్టీ స్పోర్ట్స్ స్టేడియాన్ని ప్రారంభించాడు. ఇప్పటివరకు 25 గ్రౌండ్స్ నిర్మాణం పూర్తయ్యాయి. సచిన్ కుమార్తె సారా, కోడలు సానియా చందోక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

