సింగరేణి ఎన్నికలు జరిగేనా?..మళ్లీ హైకోర్టుకు చేరిన ఎన్నికల వ్యవహారం

సింగరేణి ఎన్నికలు  జరిగేనా?..మళ్లీ హైకోర్టుకు చేరిన ఎన్నికల వ్యవహారం

 

  • మళ్లీ హైకోర్టుకు చేరిన గుర్తింపు సంఘం ఎన్నికల వ్యవహారం 
  • మార్చి తర్వాత నిర్వహించాలని ఇంధనశాఖ పిటిషన్​
  • ఈ నెల18న హైకోర్టులో వాదనలు 
  • ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు వాయిదా

కోల్​బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండటంతో గెలుపే లక్ష్యంగా అన్ని కార్మిక సంఘాలు బొగ్గు గనులపై ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఇంతలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని, మార్చి 2024 తర్వాత నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ గురువారం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పిటిషన్​అడ్మిట్​అయింది. దీనిపై ఈనెల18న వాదనలు జరగనున్నాయి. ఇంధనశాఖ పిటిషన్​తో ఈ నెల 27న జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. కోర్టు నుంచి వచ్చే తీర్పును బట్టి ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది.  కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ సర్కార్.. ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, అడ్మినిస్ర్టేటివ్, శాంతిభద్రతల పరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఎన్నికలకు మరింత గడువు కావాలని, మార్చి తర్వాత నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించింది. ఈ నేపథ్యంలోనే ఇంధనశాఖ హైకోర్టులో పిటిషన్​వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు  ఇప్పుడు యూనియన్​ ఎన్నికలు జరిగితే  అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్​ గెలుపొటములపై ప్రభావం చూపుతుందని  భావించే సర్కారు కోర్టును ఆశ్రయించిందని ఇతర కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 

ఎప్పుడో నిర్వహించాల్సి ఉన్నా..

 సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వివిధ కారణాలతో గతేడాది డిసెంబర్​నుంచి వరుసగా నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. అప్పటి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, సింగరేణి యాజమాన్యం, ఏఐటీయూసీ యూనియన్లు ఎన్నికల వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 27న కేంద్ర కార్మికశాఖ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం షెడ్యూల్​విడుదల చేసింది. అంతకు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అక్టోబర్​28న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్​6,7 తేదీల్లో నామినేషన్లు, స్క్రూటినీ, విత్​డ్రాలు చేసి అక్టోబర్10కు ప్రక్రియను ముగించాల్సి ఉండే. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో గుర్తింపు ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు సుముఖంగా లేరని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించాలని, అప్పపటి వరకు వాయిదా వేయాలని అక్టోబర్11న సింగరేణి కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఈ ఎన్నికలను డిసెంబర్​27కు వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో డిసెంబర్​మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలువగా ఇటీవల డ్రాప్ట్​ఓటర్​జాబితా విడుదలైంది. గడిచిన పది రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. మరో 12 రోజుల్లో గుర్తింపు ఎన్నికలు జరుగుతాయని అందరు భావిస్తున్న టైమ్​లో రాష్ట్ర ఇంధనశాఖ మరోసారి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. 

సింగరేణి ఎన్నికలపై ఎమ్మెల్యేలతో మంత్రి మీటింగ్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై మంత్రి శ్రీధర్​బాబు శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్​లో కోల్ బెల్ట్​ప్రాంత ఎమ్మెల్యేలు, ఐఎన్​టీయూసీ నాయకులతో సమావేశమయ్యారు. ఐదు పార్లమెంట్, 15 అసెంబ్లీ  నియోజకవర్గాల పరిధిలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో అన్ని డివిజన్​లలో ఐఎన్ టీయూసీని గెలిపించాలని మంత్రి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్​లో కాంగ్రెస్​పార్టీ సత్తా చాటిందని, కార్మిక సంఘం ఎన్నికల్లోనూ విజయ పరంపర కొనసాగించాలని అన్నారు. గతంలో రెండుసార్లు బీఆర్ఎస్​అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్​ఎన్నికల్లో గెలిచిందని, ఈసారి ఐఎన్​టీయూసీని గెలిపించడమే టార్గెట్​గా ప్రతి ఎమ్మెల్యే పని చేయాలని సూచించారు.