
- పంజాబ్ నేషనల్ బ్యాంక్తో సంస్థ ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికుల కోసం సంస్థ మరో బీమా పథకం అందుబాటులోకి తెచ్చింది. కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.25 కోట్ల పరిహారం అందనుంది. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్తో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. ఇది సింగరేణి చరిత్రలో చారిత్రక ఘట్టమని అన్నారు.
కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే, బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం తెచ్చాం. ఇప్పటికే అమల్లో ఉన్న రూ.కోటి బీమా పథకానికి ఇది అదనం. అంతేకాకుండా కార్మికులది సహజ మరణమైతే రూ.10 లక్షలు అందుతుంది. అవుట్ సోర్సింగ్ కార్మికులకు రూ.40 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం” అని చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో, ఎండీ అశోక్ చంద్ర మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ఇతర సంస్థలకు ఆదర్శమని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్న సింగరేణి సంస్థకు బ్యాంక్ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.