హైదరాబాద్లో పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నమూనాగా ఏర్పాటు చేసిన మల్టీలెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ ట్రయల్ రన్ పూర్తయ్యింది. కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ ను శనివారం (నవంబర్ 29) నుంచి ప్రారంభిస్తున్నారు. దీంతో కేబీఆర్ పార్క్ దగ్గర పార్కింగ్ ఇబ్బందులు తీరనున్నాయి. ఇదే మోడల్ ను సిటీలోని పలు చోట్ల దశలవారిగా ప్రారంభించనున్నారు.
మల్టీ లెవెల్ పార్కింగ్ ట్రయల్ రన్ పూర్తి కావడంతో శనివారం ప్రారంభిస్తున్నారు. నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ ఫెసిలిటీ. ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ కు వచ్చేవారితో పాటు చుట్టుపక్కల వారికి పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను జీహెచ్ఎంసీ అధ్వర్యంలో నవ నిర్మాణ్ అసోసియేట్స్ నిర్మించింది.
ఒకేసారి 72 కార్ల పార్కింగ్:
ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీలో ఒకేసారి 72 కార్లను పార్క్ చేసే సదుపాయం ఉంటుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్ లో మల్టీ లెవెల్ పార్కింగ్ ను నవ నిర్మాణ అసోసియేట్ నిర్వహించనుంది.
ఎలా పనిచేస్తుంది:
ఇక్కడ పార్క్ చేయాలంటే ముందగానే పార్కింగ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు నేరుగా వెళ్లి కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ చేసుకునేందుకు, నావిగేషన్, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్ యాప్ ను తీసుకురానున్నారు.
రొటేషన్ మెషిన్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒక కారును పార్కు చేస్తే మెషిన్ తిప్పుతూ పైకి పంపిస్తారు. అరలు అరలుగా ఉండే ఈ పార్కింగ్ లో.. ఒక కారు పైకి వెళ్తుంటే మరో కారు కిందికి వస్తుంది. చక్రం తిరిగినట్లుగా.. ఒక అర పైకి వెళ్తే మరో అర కిందికి వస్తుంది. దీని ద్వారా చాలా స్థలం సేవ్ అవుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరాలలో పార్కింగ్ కు స్థలం దొరకడం కష్టం. దీన్ని అధిగమించేందుకు తక్కువ స్థలంలో ఎక్కు వాహనాలు పార్క్ చేసుకునేలా ఈ సిస్టమ్ ను నగరానికి పరిచయం చేస్తున్నారు.
