
శ్రావణమాసం మొదలైంది... పూజలు.. వ్రతాలు... నోములతో నారీమణులు బిజీ కానున్నారు. విష్ణుమూర్తి జన్మనక్షత్రమైన శ్రవణం పేరుతో శ్రావణమాసం ఏర్పడిందని పురాణాలు ద్వారా తెలుస్తోంది. ఈ నెలలో పూజలు చేసి శ్రావణ శుక్రవారం.. శ్రావణ మంగళవారం.. వరలక్ష్మీ వ్రతం రోజున వాయనాలు ఇచ్చే సాంప్రదాయం ఉంది. వాయనాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. . .
శ్రావణమాసంలో లక్ష్మీదేవిని... అలాగే పరమేశ్వరుని ధర్మపత్ని పార్వతి దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి ఆశీర్వాదం కోసం వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మంగళవార వ్రతాలు ఆచరించి, ముత్తైదువులకు వాయనం ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు.త్రేతా యుగంలో సరస్వతి దేవి.. లక్ష్మీదేవికి.. పార్వతిదేవికి వాయనాలు ఇచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. తెలియక చేసే కొన్ని పొరపాట్లు పూజా ఫలితాన్ని తగ్గుతుంది.
ఈ పనులు అస్సలు చేయవద్దు..
మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి తినడం: శ్రావణ మాసంలో శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యం, పొగాకు వంటివి పూర్తిగా మానేయాలి. అలాగే, ఉల్లి, వెల్లుల్లి వంటివి కూడా ఆహారంలో చేర్చుకోకూడదు. ఇవి తామసిక ఆహారాలుగా భావిస్తారు.
శరీరానికి నూనె రాసుకోవడం: శ్రావణ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం అశుభమని పండితులు చెబుతున్నారు. కాని నూనె దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
పగటి పూట నిద్రపోవడం: శ్రావణ మాసంలో... ముఖ్యంగా వ్రతాలు చేసే రోజుల్లో పగటి పూట నిద్రపోవడం మంచిది కాదు.
తల వెంట్రుకలు .. గడ్డం కత్తిరించుకోవడం : శ్రావణ మాసంలో తల వెంట్రుకలు, గడ్డం కత్తిరించుకోకూడదు.
రాగి పాత్రలో వండిన ఆహారం తినడం: రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ మాసంలో తినకూడదు.
తులసి ఆకులను శివుడి పూజలో వాడటం: పరమశివుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించకూడదు. శివుడికి మారేడు దళాలు ప్రీతికరమైనవి.
పవిత్రంగా ఉండటం: శ్రావణ మాసం మొత్తం పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. ముఖ్యంగా పూజలు చేసేటప్పుడు, వాయనం ఇచ్చేటప్పుడు మడి, శుచి పాటించాలి.
Also Read:-ఆధ్యాత్మికం: సన్ డే ఫన్ డే కాదు... ఆ రోజు ఏంచేయాలి.. ఏం చేయకూడదు..!
బ్రహ్మచర్యం పాటించాలి: శ్రావణమాసంలో నోములు.. వ్రతాలు.. వ్రతం ఆచరించే వారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కాని దంపతులు దగ్గరిగానే ఉండాలి.
వాయనం ఇచ్చే విషయంలో: వాయనం ఇచ్చే టప్పుడు ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి. వారినే సాక్షాత్తు అమ్మవారిగా భావించాలి. వాయనం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపడం లేదా అనాదరణ చేయడం చేయకూడదు. అలా చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు.
వాయనంలో లోపాలు: వాయనంలో ఇచ్చే వస్తువులు శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. పాడైన లేదా అశుభకరమైన వస్తువులను వాయనంగా ఇవ్వకూడదు. సాధారణంగా పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, తాంబూలం, పిండివంటలు వంటివి ఇస్తారు.
శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, వాయనాలు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. ఈ నియమాలను పాటించడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని పండితులు చెబుతున్నారు.